సింగరేణి కార్మికులకు కేసీఆర్ శుభవార్త.. రిటర్మెంట్ వయసును పెంచుతూ నిర్ణయం
సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో 43,899 మంది సింగరేణి కార్మికులకు లబ్ధి కలగనుంది.
సింగరేణి కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త చెప్పారు. సంస్థలో కార్మికుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో 43,899 మంది సింగరేణి కార్మికులకు లబ్ధి కలగనుంది. అలాగే రామగుండంలో సింగరేణి మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.
దేశంలోని బొగ్గు ఉత్పత్తి సంస్థల్లో సింగరేణి అగ్రగామి అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు సింగరేణి ఆదాయం రూ.12 వేల కోట్లని.. ఈ ఏడాది సింగరేణి ఆదాయం దాదాపు రూ.27 వేల కోట్లని కేసీఆర్ తెలిపారు. ఇందిరమ్మ, ఎన్టీఆర్ ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో కొత్త ఇండ్లు నిర్మించే అంశంపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. దళిత బంధు పథకం విధి విధానాలు ఖరారవుతున్నాయని.. అర్హులైన వారికి అందేలా కృషి చేయాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దళిత బంధు పథకంతో దాదాపు 30 వేల మందికి లబ్ధి కలుగుతుందని సీఎం అన్నారు.