ప్రభుత్వంలో టిఎస్ ఆర్టీసీని విలీనం చేస్తూ కేసిఆర్ ప్రభుత్వం పంపిన బిల్లుపై తెలంగాణ గవర్నర్ తమిళిసై కొన్ని వివరణలు కోరారు. తాను వ్యక్తం చేసిన అభ్యంతరాలపై స్పష్టమైన వివరణలు ఇవ్వాలని ఆమె అడిగారు.
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంతో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వం నుంచి అందిన బిల్లుపై గవర్నర్ తమిళిసై వివరణలు కోరారు. తాను బిల్లును పెండింగులో పెట్టడంపై ఆర్టీసీ కార్మికులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నప్పటికీ తమిళసై బిల్లులోని ఐదు అంశాలపై వివరణ కోరారు. కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
19958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సహాయం గురించిన వివరాలు బిల్లులో లేవని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్రమైన వివరాలు బిల్లులో లేవని ఆమె తప్పు పట్టారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం వారి సమస్యలకు పారిశ్రామిక వివాదాల చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలను ఎలా కాపాడుతారని తమిళిసై ప్రశ్నించారు. విలీనం ముసాయిదా బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పింఛను ఇస్తారా, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు కల్పించడానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగుల్లో కండక్టర్, కంట్రోలర్ వంటి తదితర పోస్టులు లేనందు వల్ల వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోుగలకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆమె కేసిఆర్ ప్రభుత్వాన్ని అడిగారు.ఆర్టీసి కార్మికుల భద్రత, భవిష్యత్తు ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ఆమె కోరారు.
టిఎస్ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసిఆర్ ప్రభుత్వం ముసాయిదా బిల్లును రూపొందించి ఆమోదం కోసం గవర్నర్ తమిళిసైకి పంపింది. ఆ బిల్లును ప్రస్తుతం జరుగుతున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని ప్రభుత్వం భావించింది. అయితే, తమిళిసై దాన్ని ఆమోదించకుండా పెండింగులో పెట్టారు. ఆర్టిక ప్రయోజనాలు గల బిల్లు కావడంతో శాసనసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం అవసరమైంది.
బిల్లును పెండింగులో పెట్టడంపై ఆర్టీసీ కార్మికులు కూడా భగ్గుమంటున్నారు. ఈ రోజు శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు బస్సులను ఆపేసి నిరసన వ్యక్తం చేశారు. చలో రాజభన్ కార్యక్రమాన్ని చేపట్టారు. గవర్నర్ దిగి రాకపోతే ఆందోళనను పెంచుతామని వారు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బిల్లులోని కొన్ని అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మరికొన్ని అంశాలపై వివరణ కోరుతూ ప్రభుత్వానికి పంపించారు.
గవర్నర్ తమిళిసైకి, కేసిఆర్ కు మధ్య ఈ వివాదంతో మరింత పెరిగింది. ఇప్పటికే ఇరువురి మధ్య పలు అంశాలపై విభేదాలు పొడసూపాయి. ప్రభుత్వంపై తమిళిసై బహిరంగంగానే విమర్శలు చేసిన సందర్భాలున్నాయి.
