అధిక ఫీజులు.. కరోనా చికిత్స పేరిట వ్యాపారం: విరించి ఆసుపత్రిపై వేటు
కరోనా వైద్యం పేరిట లక్షలకు లక్షలు బిల్లులు వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పోరేట్ ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది
కరోనా వైద్యం పేరిట లక్షలకు లక్షలు బిల్లులు వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న కార్పోరేట్ ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇప్పటికే దక్కన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న సర్కార్.. తాజాగా మరో కార్పోరేట్ హాస్పిటల్ విరించి ఆసుపత్రిపై వేటు వేసింది. ఈ ఆసుపత్రిలో కరోనా వైద్యం రద్దు చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.
విరించి హాస్పిటల్ తీరుపై కరోనా పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కోవిడ్ రోగుల నుంచి రోజుకి లక్ష చొప్పున వసూలు చేసినట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే పేషెంట్ల నుంచి రోజుకి రూ.10 వేలకు మించి తీసుకోకూడదని ప్రభుత్వం చెప్పింది.
అలాగే విరించి ఆసుపత్రి బిల్లుల్లో భారీగా తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను విచారించిన అనంతరం విరించి ఆసుపత్రిపై తెలంగాణ సర్కార్ వేటు వేసింది.
Also Read:కరోనా రోగుల నుండి ఫిర్యాదులు: డెక్కన్ ఆసుపత్రిపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు
డెక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స కోసం చేరిన రోగుల నుండి లక్షలాది రూపాయాలను వసూలు చేయడంపై పలువురు రోగులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అంతేకాదు కరోనా చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన రోగులు చనిపోయిన కూడ లక్షలాది రూపాయాలు చెల్లించకపోతే కనీసం డెడ్బాడీలు కూడ ఇవ్వని పరిస్థితి నెలకొంది. దీంతో ఇక్కడ కరోనా రోగులకు చికిత్స చేయడాన్ని ప్రభుత్వం నిషేధించింది.
కార్పోరేట్ ఆసుపత్రుల దందాపై నిపుణుల కమిటీ వేశామని.. పద్దతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని ఈటల రాజేందర్ హెచ్చరించిన కొద్దిగంటల్లోనే ఈ ఆదేశాలు రావడం కొసమెరుపు.