కేసీఆర్ తెలంగాణ ఆస్తి, ధైర్యం, దైవం...: ఆవిర్భావ దినోత్సవంలో మంత్రి గంగుల
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ తీగల గుట్టపల్లి ప్రాంతంలోని తెలంగాణ భవన్ లో మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు.
కరీంనగర్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్యంగా ప్రభుత్వం కార్యలయాలు, అధికార టీఆర్ఎస్ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటున్నారు. ఇలా కరీంనగర్ తీగల గుట్టపల్లి ప్రాంతంలోని తెలంగాణ భవన్ లో మంత్రి గంగుల కమలాకర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో కూడా మంత్రి గంగుల జెండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ గడ్డమీద కేసీఆర్ పుట్టడం తెలంగాణ ప్రజల అదృష్టమన్నారు. కేసీఆర్ పుట్టిన గడ్డమీదే తాను కూడా పుట్టడం తన అదృష్టమని మంత్రి వెల్లడించారు.
''ఆరు సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో అద్భుత ఫలితాలు వచ్చాయి. కేసీఆర్ తెలంగాణ ఆస్తి...తెలంగాణ ప్రజల ధైర్యం ,దైవం..కేసీఆర్ హయాంలో దేశానికే అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగింది. వ్యవసాయంలో అద్భుత ప్రగతి సాధించాం'' అని తెలిపారు.
దేశం ఆకలి తిర్చేవిధంగా సీఎం కెసిఆర్ తెలంగాణను తయారు చేశారని అన్నారు. తెలంగాణ లోఇప్పటి వరకు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం అని అన్నారు. సీఎం కేసిఆర్ తెలంగాణ అస్థిఅని వెల్లడించారు.ఆత్మహత్యల తెలంగాణను ఆరేళ్లలో సీఎం కేసిఆర్ అభివృద్ధి చేశారని మంత్రి పేర్కొన్నారు.
''బీజేపీ నాయకులకు తెలంగాణ ఆవిర్భావం వేడుకలకు హాజరు కాకపోవడం బాధాకరం. ఇలా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ తెలంగాణ ప్రజలను, అమరవీరులను కించపరిచారు'' అని మండిపడ్డారు.
తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నారదాసు ,జెడ్పి చైర్మన్ కనమల్ల విజయ ,మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.