ప్రతి రెండు నెలలకు రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలి: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీష్
ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

హైదరాబాద్: ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు నెలలకు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సోమవారం నాడు 42 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. హైద్రాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్ నుండి మంత్రి హరీష్ రావు ఈ సమావేశంలో వీడియో కాన్పరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ పరిహారం తప్పనిసరిగా పరిహార నిధి నుండే చెల్లించాలని ఆయన కోరారు. సెస్ తో పాటు, జీఎస్టీ కౌన్సిల్ సిఫారసు చేసే ఇతర మొత్తం నిధులను తప్పనిసరిగా జీఎస్టీ పరిహార నిధిలో జమ చేయాలన్నారు.
ఆప్షన్ 1, ఆప్షన్ 2 కింద పెర్కొన్న రుణాలు ఇతర నిధుల కింద ఉన్నట్లు పరిహార నిధి చట్టం సెక్షన్ 10(1) చెబుతోందన్నారు. దీనిపైన జీఎస్టీ కౌన్సిల్ చర్చించ వచ్చన్నారు.
ఆప్షన్ 1 లో చెల్లించాల్సిన పరిహారాన్ని లక్ష పది వేల కోట్ల కు, ఆప్షన్ 2 లో లక్ష 83 వేల కోట్లు కు రివైజ్డ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. వీటి మధ్య అంతరం 73 వేల కోట్లు మాత్రమేనని చెప్పారు. ఆప్షన్ 1 లో పేర్కొన్న పరిహారంతో పాటు ఈ 73 వేల కోట్లు చెల్లించాలని ఆయన కోరారు.
ఈ సమావేశంలో చత్తీస్గఢ్ మంత్రి చెప్పినట్టు జీఎస్టీ పరిహారం చెల్లింపుల కోసం తీసుకునే రుణం ఆర్టికల్ 293 పరిధిలో ఉండదన్నారు.. దీన్ని తాము సమర్థిస్తున్నట్టుగా ఆయన చెప్పారు. 15 వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా 2.43 నుంచి 2.13 కు తగ్దించిందన్నారు.
కేంద్రం ఈ రోజు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ ఫైనాన్స్ కమిషన్ ఫార్ములాతో ఈ ప్యాకేజీ ఇవ్వడంవల్ల తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుందన్నారు.
ఈ రోజు ప్రకటించిన ప్యాకేజీ రాష్ట్రాల జనాభా, ఆయా రాష్ట్రాల క్యాపిటల్ ఎక్సపెండిచర్ ను పరిగణలోకి తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు కోరారు.
దీని వల్ల అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు మేలు జరుగుతుందని చెప్పారు.
15 వ ఆర్థిక సంఘం డెవెల్యూషన్ గ్రాంటు 2.43 నుంచి 2.13 తగ్గించడం వల్ల జరుగుతున్న నష్టాన్ని పూడ్చడానికి తెలంగాణ కు 723 కోట్లు వన్ టైం గ్రాంటు కింద ఇవ్వాలని సిఫారసు చేసిందన్నారు.ఈ సిఫారసులను కేంద్రం ఆమోదించలేదు. 15 వ ఆర్థిక సంఘం సిఫారసు చేసినట్లు 723 కోట్లను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.