తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఎంబీఏ చదువుతోన్న ఓ యువతి క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుంది. మేడ్చల్ జిల్లాలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన జరిగింది.
నేటి తరం యువత సమస్యలను ధైర్యంగా ఎదుర్కొలేకపోతున్నారు. కాస్తా ఒత్తిడిని కూడా తట్టుకోలేపోతున్నారు. ముందు వెనుక ఆలోచించకుండా.. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చావుతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా ఎంబీఏ చదువుతోన్న ఓ యువతి క్షణికావేశంలో అనాలోచిత నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన మేడ్చల్ జిల్లాలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల మేరకు.. మేడ్చల్ జిల్లాలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో సుభాష్నగర్ లాస్ట్ బస్టాప్ ప్రాంతంలో ఉండే కరీంశెట్టి జన్ని, సత్యవతి దంపతుల కుమార్తె యువనాగదుర్గ (23). ఆమె ఎంబీఏ చదువుతోంది. అయితే.. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో స్థానికంగా ఉండే పెయింటర్తో పెళ్లి నిశ్చయించారు. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. గత నెల 29న తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఆమె, సోదరుడు ఉన్నారు. అయితే ఆదివారం నాడు ఇంట్లో ఎవరూ లేనిది చూసి.. యువ నాగదుర్గ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి కారణంగానే మనస్థాపంతో ఉరేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇష్టం లేని పెళ్లి..
ఇలాంటి ఘటననే చౌటకూర్ మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది. తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని చౌటకూర్కు చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌటకూర్ గ్రామానికి చెందిన యువతికి, హత్నూర మండలం కొన్యాల గ్రామంలోని అనిల్ అనే యువకుడికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. పైగా వీరిద్దరూ బంధువులు. వరుసకు బావ మరదలు. కానీ ఆ యువతికి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ పెద్దలు ఆమె నిర్ణయాన్ని పట్టించుకోలేదు. పెళ్లి చేసుకోవాలంటూ బలవంత పెట్టారు. దీంతో తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో పుల్కల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 ) కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
