ఒకే చోట లిఫ్టులన్నింటికీ శంకుస్థాపన: కేసీఆర్ సంచలన నిర్ణయం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి వ్యవస్థపై తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులతో సీఎం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ, నాగార్జున సాగర్, మునుగోడు, కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల పరిధిలోని నెల్లికల్లుతోపాటు ఇతర ఎత్తిపోతల పథకాలను త్వరితగతిన నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
రూ.3 వేల కోట్లతో నెల్లికల్లు లిఫ్టుతోపాటు మరో 8-9 ఎత్తిపోతల పథకాలను నిర్మించనున్నట్లు సీఎం స్పష్టం చేశారు. ఈ ఎత్తిపోతల పథకాలన్నింటికీ ఒకేచోట శంకుస్థాపన చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.
ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంట 30 నిమిషాలకు నెల్లికల్లులో సీఎం కేసీఆర్ నెల్లికల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు హాలియాలో జరిగే టీఆర్ఎస్ బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు.
ఈ సమావేశానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్ పర్సన్లు, ఇతర ముఖ్య అధికారులు హాజరయ్యారు.