ఉపాధ్యాయ దినోత్సవం(సెప్టెంబర్ 5) వేళ తెలంగాణలోని గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

ఉపాధ్యాయ దినోత్సవం(సెప్టెంబర్ 5) వేళ తెలంగాణలోని గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. గురుకుల పాఠశాలల కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్దీకరణకు నిర్ణయం తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 63 మంది పురుషులు, 504 మంది మహిళలు కలిపి మొత్తం 567 మంది సిబ్బందిని క్రమబద్దీకరించినట్టు ఉత్తర్వులో పేర్కొంది. ఇక, 2007 సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం ఎంపికైన వారికి అవకాశం కల్పించినట్టు తెలిపింది. ఇక, 16 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్‌ పద్ధతిన కొనసాగుతున్న సిబ్బందిని క్రమబద్దీకరించడం పట్ల ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హర్షం వ్యక్తం చేశారు. 

ఇదిలా ఉంటే, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థుల్లో క్రమశిక్షణను, జ్ఞానాన్ని పెంపొందించి, లక్ష్యం పట్ల వారికి స్పష్టమైన అవగాహనను కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర వెలకట్టలేనిదని కేసీఆర్ అన్నారు. ‘‘మాతృదేవోభవ.. పితృదేవోభవ.. ఆచార్యదేవోభవ’’ అనే సూక్తి తల్లిదండ్రులు తర్వాత గురువుకున్న ప్రాధాన్యతను తెలియచేస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, ఉపాధ్యాయుల విద్యార్థుల సంక్షేమానికి, అభివృద్ధికి సమర్థవంతమైన కార్యాచరణను అమలుచేస్తుందని చెప్పారు.

గురుకుల విద్యలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని, నాణ్యమైన విద్యను అందిస్తూ రేపటి తరాన్ని తీర్చిదిద్దడంలో ముందంజలో ఉందని కేసీఆర్ తెలిపారు.గుణాత్మక విద్యను అందిస్తూ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణ సత్ఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలతో నేడు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లోనూ, క్రీడల్లోనూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నారని చెప్పారు. విద్యారంగ ప్రగతి పట్ల తెలంగాణ ప్రభుత్వానికున్న అంకితభావానికి, చిత్తశుద్ధికి ఇది నిదర్శమని అన్నారు.