Telangana: కేబినెట్ భేటీ నేడే .. వాటిపైనే ప్రధాన చర్చ.. సర్వత్రా ఉత్కంఠ..!
Telangana cabinet meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరుగునున్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కావస్తుంది. ఈ తరుణంలో జరుగుతున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
![Telangana cabinet to meeting today for important decisions KRJ Telangana cabinet to meeting today for important decisions KRJ](https://static-ai.asianetnews.com/images/01hhvdkwm4w54vzwcf17759f4n/cm-jpg_363x203xt.jpg)
Telangana cabinet meeting: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ మంత్రివర్గం సోమవారం (నేడు) డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమావేశం కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల తర్వాత జరిగే ఈ సమావేశంలోకీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా ఆరు హామీల అమలుకు సంబంధించిన ఎజెండాపైనా, ఇప్పటివరకు రాష్ట్ర పాలనపై సమీక్ష జరిపే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో పాటు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం మిగిలిన నాలుగు గ్యారంటీల అమలుపై కూడా చర్చించనున్నారు.
క్యాబినెట్లో పలు ఇతర అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో త్వరలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ పదవులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) చైర్మన్ల నియామక ప్రక్రియను మంత్రివర్గం వేగవంతం చేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండో మంత్రివర్గ సమావేశం.
మరోవైపు నెల రోజుల పాలనపై సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. "తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది. బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి. ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది. సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి. హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి. నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి. ఇది మీ అన్న ఇస్తున్న మాట" అని పేర్కొన్నారు.