Asianet News TeluguAsianet News Telugu

క్యాబినెట్ భేటీ: విద్య, వ్యవసాయానికి సంబంధించి కేసీఆర్ కీలక నిర్ణయం

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై కేబినెట్ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10-12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. 

Telangana Cabinet Meet: Education To Agriculture These Are The Key Decisions
Author
Hyderabad, First Published Aug 6, 2020, 7:59 AM IST

రాష్ట్రంలోని పరిస్థితులను సమీక్షించడానికి తెలంగాణ కాబినెట్ నిన్న సమావేశమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్  జరిగిన ఈ  సమావేశంలో కరోనా నుంచి మొదలుకొని వ్యవసాయం వరకు అనేక విషయాలను చర్చించారు.

ప్రభుత్వం సూచించిన మేరకు నియంత్రిత సాగు పద్ధతిలో ఈ సారి వానాకాలం పంటలు వేసిన రైతులను రాష్ట్ర కేబినెట్ అభినందించింది. నియంత్రిత పద్ధతిలో సాగు విధానం వ్యవసాయ రంగంలో గొప్ప విప్లవానికి నాంది అని, ప్రభుత్వం చెప్పింది తమకోసమే అని రైతులు గ్రహించడం వారి చైతన్యానికి, పరివర్తనా శీలతకు నిదర్శనమని కేబినెట్ అభిప్రాయపడింది. 

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన అంశాలపై కేబినెట్ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతి ద్వారా రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10-12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. 

గత వానాకాలంలో రాష్ట్రంలో కోటి 22 లక్షల ఎకరాల్లో సాగు జరిగితే, ఈ సారి కోటి 30 లక్షలకు పైగా ఎకరాల్లో సాగు జరుగుతున్నదని వారు వివరించారు. తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం, పంటల దిగుబడి పెరగడం పట్ల కేబినెట్ హర్షం వ్యక్తం చేసింది. 

తెలంగాణ వ్యవసాయం దేశానికే అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని, ఇటీవల ఎఫ్.సి.ఐ. సేకరించిన ధాన్యంలో రాష్ట్రం వాటా 55 శాతంగా తేలడం ఈ విషయం నిరూపించిందని కేబినెట్ అభిప్రాయపడింది. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న రైతుబంధు ద్వారా ఈ వానాకాలంలో ఒకేసారి పెద్ద మొత్తంలో రైతులకు నగదు సహాయం అందిందని,  కరోనా కష్టకాలంలో ఇది రైతులకు పెద్ద సహాయంగా ఉపయోగపడిందని మంత్రులు అన్నారు. 

కోటి 45 లక్షల ఎకరాలకు సంబంధించి, 57.62 లక్షల మంది రైతులకు, రూ.7,251  కోట్ల రూపాయలు అందించడం అసాధారణమని పేర్కొన్నారు. ఇంకా ఎక్కడైనా రైతులు మిగిలిపోయినా వారిని గుర్తించి సహాయం అందించాలని అధికారులను కోరింది. 

వసాయంలో యాంత్రీకరణ పెంచాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న వ్యవసాయ యంత్రాల గణన చేపట్టాలని, ఇంకా ఎన్ని అవసరమో గుర్తించాలని అధికారులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయాలని సిఎం కోరారు. రైతు వేదికలకు స్థలం ఇచ్చినా, నిర్మాణానికి నిధులు ఇచ్చినా వారు సూచించిన వారి పేరును వేదికకు పెట్టాలని సిఎం ఆదేశించారు.

వ్యవసాయం లాభసాటిగా మారడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు పెట్టాలనే సిఎం నిర్ణయాన్ని కేబినెట్ అభినందించింది. రైతులకు లాభసాటి ధర రావడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించడం లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని అభిప్రాయపడింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే మంత్రులు, అధికారులు సమావేశమై విధాన రూపకల్పన చేస్తారు.

లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని,  భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్న వారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టిఎస్ బి పాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టిఎస్ ఐపాస్ లాగానే టిఎస్ బి పాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది.

దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది.

మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు గతంలో ఉన్న విద్యుత్ బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పనికి రాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించినట్లుగానే స్వతంత్ర దినోత్సవం నిర్వహించాలని తీర్మానించింది.

కేంద్ర ప్రభుత్వ మార్గ దర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని ఆదేశించారు. డిగ్రీ, పిజి ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది.

Follow Us:
Download App:
  • android
  • ios