ఢిల్లీలో వంగి వంగి దండాలు.. నిన్ను బీజేపీ నమ్మదు: కేసీఆర్పై బండి సంజయ్ వ్యాఖ్యలు
ఢిల్లీలో తెలంగాణ భవన్ ను ఎవరి కోసం, ఎందుకోసం కడుతున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ను తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ను బీజేపీ నమ్మదని.. టీఆర్ఎస్తో కలిసి బీజేపీ పని చేసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. మతతత్వ పార్టీ ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ పని చేస్తోందని సంజయ్ మండిపడ్డారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సెటైర్లు వేశారు. ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ అక్కడ ఒంగి ఒంగి దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీలో తెలంగాణ భవన్ ను ఎవరి కోసం, ఎందుకోసం కడుతున్నారని సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ను బీజేపీ నమ్మదని.. టీఆర్ఎస్తో కలిసి బీజేపీ పని చేసే ప్రసక్తే లేదని ఆయన కుండబద్ధలు కొట్టారు. మతతత్వ పార్టీ ఎంఐఎంతో కలిసి టీఆర్ఎస్ పని చేస్తోందని సంజయ్ మండిపడ్డారు.
దళితబంధు మాదిరే బీసీ బంధు, గిరిజన బంధు కార్యక్రమాలను అమలు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. 80 శాతం మంది హిందువులు ఉన్న తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని సంజయ్ ఆకాంక్షించారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని కేసీఆర్... దళితబంధు ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దళితబంధు ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ బీజేపీ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. పవర్ అంతా ఢిల్లీ చేతిలోనే వుందని.. రాష్ట్ర బీజేపీ కమిటీకి పవర్ లేదంటూ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎదుగుదలను అడ్డుకునేందుకు టీఆర్ఎస్, బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ గల్లీలో కేసీఆర్ను తిడుతున్నాడని.. ఢిల్లీలో బీజేపీ నేతలతో కేసీఆర్ తిరుగుతున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.