Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా: గంటల వ్యవధిలోనే స్పీకర్ ఆమోదం

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందజేశారు ఈటల. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. 

telangana assembly speaker pocharam srinivas reddy accepted etela rajender resignation ksp
Author
Hyderabad, First Published Jun 12, 2021, 2:07 PM IST

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఇవాళ ఉదయం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ కార్యదర్శికి లేఖను అందజేశారు ఈటల. ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన రాజేందర్ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. శామీర్‌పేటలోని తన ఇంటి నుంచి తన అనుచరులతో గన్ పార్క్ చేరుకున్న ఈటల.. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.

అనంతరం అసెంబ్లీకి చేరుకుని అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందజేశారు. హుజురాబాద్ నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన ఈటలపై భూ కబ్జా ఆరోపణలు రావడంతో మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేశారు సీఎం కేసీఆర్. దీంతో టీఆర్ఎస్‌కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు ఈటల. 

అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. హుజూర్ నగర్ లో జరిగేది కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చినవాళ్లు మంత్రులుగా కొనసాగుతున్నారని, పార్ట మారే సమయంలో వారు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయలేదని ఆయన అన్నారు.

Also Read:కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టడమే ఎజెండా: రాజీనామాకు ముందు ఈటల రాజేందర్

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇటువంటి స్థితిలో రాజీనామా చేయవద్దని కొందరు చెప్పారని, కేసీఆర్ వద్ద వందల వేల కోట్ల డబ్బులు ఉన్నాయని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతారని, తద్వారా హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ ను గెలిపించుకునే అవకాశం ఉందని అంటున్నారని ఆయన అన్నారు. 17 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, యావత్ తెలంగాణ ప్రజల కోసం తాను రాజీనామా చేస్తున్నానని ఆయన చెప్పారు. 

అయితే, తాను రాజీనామా చేయడానికే సిద్ధపడినట్లు ఆయన తెలిపారు. వాళ్లు తొలగించాల్సిన పరిస్థితి వస్తే రాజీనామా చేయాలని చెప్పారని ఆయన అన్నారు హుజూరాబాద్ లో జరిగేది కురుక్షేత్రమేనని ఆయన అన్నారు. హుజూరాబాద్ ప్రజలు నిర్బంధాలకు, అరెస్టులకు, కేసులకు భయపడరని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు ఛీకొడుతున్నారని ఆయన అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios