ఓటు ఓ చోట పోటీ మరో చోట: వీళ్ల ఓటు ఇతరులకే
ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న పలు పార్టీల అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు వేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి.
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న పలు పార్టీల అభ్యర్థులు తాము పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటు వేసుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బరిలో ఉన్న అభ్యర్థులు ఎక్కువగా పరిస్థితి నెలకొంది.
ముషీరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో అనిల్ కుమార్ యాదవ్ చార్మినార్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటు ఉంటుంది. మొదటిసారిగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే చార్మినార్ సెగ్మెంట్లో అనిల్ కుమార్ కు ఓటు హక్కు ఉంది. కానీ ఆయన ముషీరాబాద్ నుండి పోటీ చేస్తున్నందున తన ఓటును తాను వేసుకోలేని పరిస్థితి నెలకొంది.
శేరి లింగంపల్లి నియోజకవర్గం నుండి యోగానంద్ బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఆయనకు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది. ఇదే అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న భవ్య ఆనంద్ ప్రసాద్కు కూడ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కుంది.
ఉప్పల్ నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న వీరేందర్ గౌడ్కు ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కుంది. సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు ఓటు కుత్బుల్లాపూర్లో ఉంది.
జూబ్లీహిల్స్ నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన మాగంటి గోపినాథ్ ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మాగంటి గోపినాథ్ తన ఓటు హక్కును జూబ్లీహిల్స్కు మార్చుకోలేదు. ఆయన ఓటు హక్కు ఇంకా ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే కొనసాగుతోంది. ఇదే స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్న మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఓటు ముషీరాబాద్లో ఉంది.ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటు ఉన్న శ్రీధర్ రెడ్డి బీజేపీ అభ్యర్ధిగా జూబ్లీహిల్స్ సెగ్మెంట్గా పోటీలో ఉన్నారు.
అంబర్పేట్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటు హక్కు ఉన్న దాసోజు శ్రవణ్ కుమార్ ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. కూకట్పల్లి నుండి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నందమూరి సుహాసినికి నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు ఉంది.
రాజేంద్ర నగర్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బద్దం బాల్ రెడ్డికి ఖైరతాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటు హక్కు ఉంది. గత ఎన్నికల్లో ఆయన కార్వాన్ నుండి పోటీ చేశారు. నాంపల్లి ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్న జాఫర్ హుస్సేన్కు బహదూర్పుర నియోజకవర్గంలో ఓటు హక్కుంది.
మహేశ్వరం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేవేళ్లలో ఓటు హక్కుంది. మల్కాజిగిరి నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న రామచంద్రరావుకు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటుంది.
యాకుత్పురా అసెంబ్లీ నుడి బరిలో ఉన్న ఎంఐఎం అభ్యర్థి పాషాఖాద్రీకి బహదూర్ పురలో ఓటు హక్కుంది. సనత్గనర్ అసెంబ్లీ స్థానం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తలసానికి కంటోన్మెంట్ ప్రాంతంలో ఓటు హక్కుంది.
నాంపల్లి బీజేపీ అభ్యర్థి దేవర కరుణాకర్ కు కార్వాన్లో ఓటరుగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఖైరతాబాద్ నుండి బీజేపీ అభ్యర్ధిగా బరిలో ఉన్న చింతల రామచంద్రారెడ్డి ఈ దఫా కూడ అదే స్థానం నుండి బరిలోకి దిగుతున్నారు. ఆయనకు శేరిలింగంపల్లి సెగ్మెంట్లో ఓటు హక్కుంది.