సత్తుపల్లిలో చక్రం తిప్పిన యరపతినేని: మెచ్చుకొన్న చంద్రబాబు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య పోటీ చేస్తున్నారు
సత్తుపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా సండ్ర వెంకట వీరయ్య పోటీ చేస్తున్నారు.వీరయ్యకు మద్దతుగా గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును చంద్రబాబునాయుడు పంపారు. టీఆర్ఎస్ వ్యూహలకు ధీటుగా తమ ప్లాన్ సక్సెస్ అయిందని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి గత ఎన్నికల్లో సత్తుపల్లి నుండి టీడీపీ అభ్యర్థిగా సండ్ర వెంకటవీరయ్య పోటీ చేసి విజయం సాధించారు. వీరయ్య గురువు తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరినా కూడ వెంకటవీరయ్య టీడీపీలోనే ఉన్నారు.
సత్తుపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల ఇంచార్జీగా గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును టీడీపీ రంగంలోకి దించింది. నియోజకవర్గంలో ఓటర్ల నాడిని ఓడిసి పట్టుకొని యరపతినేని వ్యూహన్ని రచించారు. ఈ వ్యూహం కలిసివచ్చిందని టీడీపీ నేతలు అభిప్రాయంతో ఉన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్తుపల్లిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల సభ సందర్భంగా బాబును కలిసిన యరపతినేని శ్రీనివాసరావును బాబు అభినందించారు.
నిన్ను నమ్మి సత్తుపల్లి ఎన్నికల ఇన్చార్జిగా నియమించా. నా నమ్మకానికి తగ్గట్టుగానే రిజల్ట్ చూపించావ్. వెల్డన్ శ్రీను అంటూ గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును సీఎం చంద్రబాబునాయుడు అభినందించారు.
సత్తుపల్లి అసెంబ్లీ స్థానం జనరల్ గా ఉన్న సమయంలో తుమ్మల నాగేశ్వర్ రావు ఈ స్థానం నుండి పలు దఫాలు విజయం సాధించారు. ఇదిలా ఉంటే సత్తుపల్లిలో ఈ దఫా టీఆర్ఎస్ విజయం సాధించేందుకు ఆ పార్టీ శక్తి యుక్తులను ధారపోస్తోంది.
తొలుత సీపీఎంలో ఉన్న సండ్ర వెంకటవీరయ్య తుమ్మల నాగేశ్వర్ రావు చొరవతో సీపీఎం ను వీడి టీడీపీలో చేరారు. తుమ్మల నాగేశ్వర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరినా కూడ సండ్ర వెంకటవీరయ్య టీడీపీలోనే కొనసాగారు.ఈ స్థానంలో టీఆర్ఎస్ తన అభ్యర్థిగా పడిమర్తి రవిని బరిలోకి దింపింది.