విజయమ్మ సమ్మేళనానికి హాజరు.. కాంగ్రెస్కు వెన్నుపోటు పొడవద్దు: కోమటిరెడ్డిపై మధుయాష్కీ ఆగ్రహం
పార్టీ నిర్ణయం కాదని వైఎస్ విజయమ్మ సమ్మేళనానికి వెళ్లడం పార్టీని నష్టపరచడమేనంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు.
భువనగిరి ఎంపీ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీకాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్. కోమటిరెడ్డి ఎదుగుదలకు సోనియానే కారణమని ఆయన గుర్తుచేశారు. పార్టీ నిర్ణయం కాదని వైఎస్ విజయమ్మ సమ్మేళనానికి వెళ్లడం పార్టీని నష్టపరచడమేనని మధుయాష్కీ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా విజయమ్మ చేసిన వ్యాఖ్యలను కోమటిరెడ్డి సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో వుంటూ కాంగ్రెస్కు వెన్నుపోటు పొడవద్దని మధుయాష్కీ హితవు పలికారు. సీతక్కపై వ్యాఖ్యలు సంస్కారం లేని వాళ్లు చేసేవని ఆయన మండిపడ్డారు.
కాగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ విజయమ్మ నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరైన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కుటుంబంతో తనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకొని తాను ఈ సమావేశానికి వెళ్తున్నట్టుగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.ఈ సమావేశం రాజకీయాలకు అతీతమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి ఎవరూ వెళ్లోద్దని కాంగ్రెస్ పార్టీ నేతలను ఆదేశించింది. అయినప్పటికీ కోమటిరెడ్డి ఈ సమ్మేళనానికి హాజరవ్వడం కలకలం రేపింది.