బండి సంజయ్ పాదయాత్ర: కేసీఆర్ మీద స్వామి గౌడ్ సంచలన వ్యాఖ్యలు
బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర పేర తలపెట్టిన తన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకుడు స్వామి గౌడ్ కేసీఆర్ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రను ప్రారంభించారు. హైదరాబాదులోని పాతబస్తీలో గల భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత ఆయన శనివారం తన పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరు మీద ఆయన ఈ యాత్రను సాగిస్తున్నారు.
ఆయన పాదయాత్ర నాలుగు విడతల్లో సాగుతుంది. రోజుకు పది కిలోమీటర్లు ఆయన నడక సాగించనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, నిరంకుశ పోకడలను ఎండగట్టే ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్రను తలపెట్టారు. బండి సండయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి పెద్ద యెత్తున్న బిజెపి శ్రేణులు కదిలివచ్చాయి. చార్మినార్ ప్రాంతం కోలాహాలంగా మారింది.
ఇదిలావుంటే, ఈ సందర్భంగా బిజెపి నాయకులు స్వామి గౌడ్, నల్లు ఇంద్రసేనా రెడ్డి కేసీఆర్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు పంపిణీ చేసేందుకు భూములు లేవన్న కేసీఆర్ కు అమ్మడానికి ఎలా ఉన్నాయని స్వామిగౌడ్ ప్రశ్నిచారు. ఎవడబ్బ సొమ్మని కేసీఆర్ కోకాపేట భూములు అమ్మారని ఆయన అడిగారు.
కేసీఆర్ తనను తాను ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆయన అన్నారు. బిజెపి ఎన్నికల కోసం పాదయాత్ర చేయదని, ప్రజాసమస్యలు ఎప్పుడుంటే అప్పుడే పాదయాత్ర చేస్తుందని ఆయన అన్నారు. మోడీ ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ ఇస్తుంటే కేసీఆర్ తన ఫొటోలు పెట్టుకుని ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
కేసీఆర్ ప్రభుత్వానికి కళ్లు లేవు కాబట్టే బీజేపీ పథకాలు కనిపించడం లేదని బిజెపి నేత నల్లు ఇంద్రసేనా రెడ్డి విమర్శించారు. టీఆరెస్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న పథకాలు- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీజేపీ ఇస్తున్న పథకాలు ఎలా ఉన్నాయో ప్రత్యేక కమిటీ వేసుకోని నివేదిక తెచ్చుకోవాలని ఆయన డిమాండ్ జచేసారు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇస్తున్న పథకాలు కూడా టీఆరెస్ ప్రభుత్వం ఇక్కడ అమలు చేయడం లేదని ఆయన అన్నారు.ప్రజలకు నిజాలు చెప్పడానికే బీజేపీ పాదయాత్ర చేస్తోందని ఆయన చెప్పారు.