తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.
న్యూఢిల్లీ: తెలంగాణలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైన పిటిషన్పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన శశాంక్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిర్ణీత షెడ్యూల్ కంటే ముందే ఎన్నికలు నిర్వహిస్తే కొత్తగా ఓటర్లుగా నమోదయ్యేవారికి అవకాశం లేకుండాపోయిందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.
అసెంబ్లీ రద్దు కావడంతో ఓటర్లుగా నమోదు కావడానికి గడువును ముందుకు జరపడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని.. లక్షలాది మంది కొత్తగా ఓటర్లుగా చేరే అవకాశం లేకుండాపోయిందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.
ముందస్తుగా ఎన్నికలు జరిగితే అర్హులైన కొందరికి ఓటు హక్కు దక్కకుండాపోయిందని పిటిషనర్ తరపు న్యాయవాది అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని కోర్టు ముందు ప్రస్తావించారు.
ముందస్తు కారణంగా సుమారు 20 లక్షల మందికి ఓటు హక్కు దక్కకుండాపోతోందని పిటిషనర్ తరపు న్యాయవాది నిరూపమ్ రెడ్డి చెప్పారు.అందరికీ ఓటుహక్కు దక్కేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
ఎన్నికల కమిషనర్ 324 సెక్షన్ కింద రాష్ట్రపతి పాలన విధిస్తే... తెలంగాణలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. కేంద్ర ఎన్నికల సంఘానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
