ఎమ్మెల్సీ కడియం శ్రీహరి‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. కడియంను తక్షణం పార్టీలోంచి సస్పెండ్ చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. మంత్రిగా వుండి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని రాజయ్య దుయ్యబట్టారు.

స్టేషన్ ఘన్‌పూర్‌లో బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టీ.రాజయ్య మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కడియం శ్రీహరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజయ్య. శుక్రవారం జనగామ జిల్లా తాటికొండలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో రాజయ్య మాట్లాడుతూ.. దేవాదుల సృష్టికర్త కడియం కాదని , ఆయన ఎన్‌కౌంటర్ల సృష్టికర్త అని ఆరోపించారు. కడియంను తక్షణం పార్టీలోంచి సస్పెండ్ చేయాలని రాజయ్య డిమాండ్ చేశారు. ఎంపీలుగానీ, ఎమ్మెల్సీలు గానీ.. స్థానిక ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే నియోజకవర్గంలోకి అడుగుపెట్టాలన్నారు. 

Also Read: రాజయ్యపై ఆరోపణలకుఆధారాలు ఇవ్వని నవ్య : జాతీయ మహిళ కమిషన్ కు నివేదిక

కానీ కడియం శ్రీహరి తనకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని రాజయ్య మండిపడ్డారు. 2018 ఎన్నికల సమయంలో తాను ఆస్తులు మొత్తం అమ్ముకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత కడియం శ్రీహరి ఆస్తులు పెరిగాయని రాజయ్య ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణ ఏర్పడ్డాక కడియం మంత్రిగా వున్న సమయంలో ఎన్‌కౌంటర్లు జరిగాయని ఆయన పేర్కొన్నారు. మంత్రిగా వుండి నియోజకవర్గాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని రాజయ్య దుయ్యబట్టారు. ప్రస్తుతం ప్రజలు తన వెంటే వున్నారని.. దళితులను కంటికి రెప్పలా కాపాడతానని రాజయ్య వెల్లడించారు. నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న తాను ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.