రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘నీరా కేఫ్’ల నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నెక్లెస్ రోడ్డులోని నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘నీరా కేఫ్’ నిర్మాణ పనులను అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ జలాశయం వెంట ఉన్న నెక్లెస్ రోడ్డులో నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించామని, రాష్ట్రంలోని గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఈ పాలసీ రూపొందించామని అన్నారు. దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నీరా కేఫ్లను నిర్మిస్తున్నట్టు వివరించారు. ఈ కేఫ్లలో ఆరోగ్యప్రదాయిని నీరా, దాని అనుబంధ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
నిర్మాణ పనులు, వాటి నాణ్యతను రాష్ట్ర మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులతో చర్చించారు. నీరా కేఫ్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే నవంబర్లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
వీటితోపాటు యాదాద్రి-భువనగిరి జిల్లాల్లోని నందనవనంలో నిర్మిస్తున్న ప్రతిపాదిత నీరా ఉత్పత్తి, నీరా అనుబంధ ఉత్పత్తుల అధ్యయన కేంద్ర పనులనూ వేగవంతం చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నీరా కేఫ్లను ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. సీఎం కేసీఆర్ గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కోసం విప్లవాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నారని తెలిపారు.
