మహిళా దినోత్సవ వేడుకల్లో... కంటతడి పెట్టిన స్పీకర్ పోచారం
ఓ సినిమా పాటను వింటూ ఎమోషల్ అయిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కంటతడి పెట్టుకున్నారు.
కామారెడ్డి: అసెంబ్లీలో ఎప్పుడూ గంభీరంగా వుంటూ, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేస్తూ సభను ముందుండి నడిపిస్తారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఓ పాటను వింటూ ఎమోషల్ అయి కంటతడి పెట్టుకున్నారు. మహిళా దినోత్సవ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లాలోని తన సొంత నియోజకవర్గం బాన్సువాడలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో స్పీకర్ పోచారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈక్రమంలో పవిత్రబంధం సినిమాలోని ''అపురూపమైనదమ్మ ఆడజన్మ'' అనే పాటపై ప్రదర్శన చేశారు. ఈ సమయంలోనే స్పీకర్ ఎమోషన్ అయ్యి కంటతడి పెట్టుకున్నారు. ఈ ప్రదర్శన పూర్తయ్యేవరకు ఏడుస్తూనే వున్నారు.
అనంతరం తాను ఎందుకు ఎమోషన్ అయ్యారో వెల్లడించారు. ఈ పాట వినగానే తన తల్లి దివంగత పరిగె పాపమ్మను గుర్తుకు వచ్చిందని... దీంతో ఏడుపు ఆగలేదని తెలిపారు. 102 ఏళ్ల వయసులో తన తల్లి మరణించారని... ఆమె ఇచ్చిన స్ఫూర్తితోనే తాను ప్రజాసేవకు అంకితమయ్యానని తెలిపారు. తన విజయాల్లో భార్య పుష్పమ్మ పాత్ర కూడా ఎంతో ఉందని పోచారం తెలిపారు. ఇలా తన విజయాన్ని ఇద్దరు మహిళలు ముఖ్యపాత్ర పోషించారని పోచారం వెల్లడించారు.