అన్నం పెట్టలేదని కన్నతల్లినే..
అన్నం పెట్టలేదని కన్నతల్లినే హత్య చేశాడో కసాయి కొడుకు.. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్కు చెందిన నేనావత్ సక్కుబాయి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది.
అన్నం పెట్టలేదని కన్నతల్లినే హత్య చేశాడో కసాయి కొడుకు.. హైదరాబాద్ బంజారాహిల్స్లోని నందినగర్కు చెందిన నేనావత్ సక్కుబాయి ఇళ్లల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమారుడు గోపి తాగుడుకి బానిసై పనిపాట లేకుండా తిరుగుతూ.. ప్రతిరోజు మద్యం తాగి ఇంటికి వచ్చి తల్లిని, చెల్లిని వేధించేవాడు.
ఇటీవలే రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 17న మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అతను తల్లిని నిద్రలేపి అన్నం పెట్టాలని కోరాడు. తనకు అరోగ్యం బాగోలేదని.. నువ్వే పెట్టుకు తినాలని చెప్పింది. తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్న చెల్లెల్ని అన్నం పెట్టాల్సిందిగా కోప్పడటంతో ఆమె లేచి అన్నం వడ్డించింది.
అక్కడితో ఆగకుండా అన్నం పెట్టాల్సిందిగా పదే పదే అరవడంతో.. చెల్లెలు కసురుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గోపి అక్కడే ఉన్న క్రికెట్ బ్యాట్తో చెల్లెలి తలపై బలంగా మోదాడు. కూతురు అరవడంతో సక్కుబాయ్ అడ్డుకునే ప్రయత్నం చేసింది.. అయితే గోపి అదే బ్యాటుతో బలంగా తల్లి తలపై కొట్టాడు.
వీరి అరుపులతో స్థానికులు ఇంట్లోకి వచ్చి రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సక్కుబాయ్ని నిమ్స్కు తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అక్కడ మరణించింది.
మరోవైపు రాణి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, తల్లి,చెల్లిపై భర్త దాడి చేస్తుండగా గోపి భార్య జ్యోతి అక్కడి నుంచి పరారైంది. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు.