పెళ్లైన ఆరు నెలలకే.. భార్యవేధింపులు తట్టుకోలేక
అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
అనుమానాస్పద స్థితిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం లక్ష్మి కిషాన్ పురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్(27) బేగంపేటలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
గత మార్చి నెలలో అతనికి వనస్థలీపురంకి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సౌజన్యతో వివాహం జరిగింది. నాలుగు నెలలుగా వారు బ్యాంక్ కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా.. సోమవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో అతని భార్య ఇంట్లో లేకపోవడం గమనార్హం.
ఆరోగ్యం సరిగా లేకపోవడంతో.. హైదరాబాద్ లో ఆస్పత్రిలో చూపించుకుందామని చంద్రశేఖర్ తల్లిదండ్రులు కొడుకు ఇంటికి వచ్చేసరికి అతను శవమై కనిపించాడు. భార్య, ఆమె తల్లిదండ్రుల వేధింపులు తట్టుకోలేక తాను ఆత్మహత్య చేసుకున్నట్లు.. సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.