టీఎస్పీఎస్సీ పేపర్ లీక్కు సంబంధించి జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో సిట్ బృందం సోదాలు నిర్వహిస్తోంది. ఈ నెల 11న స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించనుంది సిట్.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ దూకుడు పెంచింది. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాలం మండలంలో గ్రూప్ 1 పరీక్షలు రాసిన వారి ఇళ్లను జల్లెడ పడుతోంది. మల్యాల మండలంలో దాదాపు 40 మంది అభ్యర్ధులు పరీక్షలు రాసినట్లుగా గుర్తించింది. ఈ క్రమంలో అభ్యర్ధుల శక్తి సామర్ధ్యాలను ఇంటి దగ్గరే పరీక్షిస్తున్నాయి సిట్ బృందాలు. అలాగే ఈ నెల 11న స్టేటస్ రిపోర్టును కోర్టుకు సమర్పించనుంది సిట్.
కాగా.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పోటీ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. దీనిపై కొనసాగుతున్న విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే, ఈ కేసు నుంచి కొందరు పెద్దమనుషులు, రాజకీయ నాయకులను తప్పించే కుట్ర జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణకు ఆదేశించాలని రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) అధికారి ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతిని అభ్యర్థించారు.
Also Read: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ .. సీబీఐకి టీ.కాంగ్రెస్ ఫిర్యాదు, ఇప్పటికే ఈడీకి కంప్లైంట్
ప్రశ్నాపత్రాల లీకేజీలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) చైర్మన్, సభ్యుల స్థానంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు ఇంతటి తీవ్రమైన కుంభకోణాన్ని విచారించే సామర్థ్యం ఏమాత్రం లేదని ఆయన వాదించారు. ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చే సిట్ నుంచి అన్ని వాస్తవాలను బయటకు తీస్తుందని పెద్దగా ఆశించలేమని పేర్కొంటూ.. సీఎం కార్యాలయమే అనుమానాలకు తావిస్తోందన్నారు.
టీఎస్ పీఎస్సీ, సిట్ తరఫున ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించడం వల్ల ఉన్నత పదవుల్లో ఉన్న అసలు దోషులను ప్రాసిక్యూషన్ నుంచి తప్పించి, చిన్న చిన్నవారిని మాత్రమే శిక్షించి కేసును ముసివేయడానికే ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసిందనే అనుమానానికి మరింత బలం చేకూరుస్తోందని ఆరోపించారు. అందుకే స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో ఇలాంటి కుంభకోణాలను విజయవంతంగా దర్యాప్తు చేసిన చరిత్ర ఉన్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కు ఉందనీ, ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహరాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని బీఎస్పీ కోరుతోందని లేఖలో పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా టీఎస్ పీఎస్సీ నోటిఫై చేసిన ప్రతిష్ఠాత్మక గ్రూప్ -1, ఏఈఈ, ఏఈ తదితర 15 పరీక్షల పేపర్ లీకేజీ/విక్రయాలతో లక్షలాది మంది ఉద్యోగార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు.
