అన్న మృతదేహానికి చెెల్లి రాఖీ కట్టిన హృదయవిధారక ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
పెద్దపల్లి : తోడబుట్టిన వారి ప్రేమానురాగాలకు నిదర్శనమే రక్షా బంధన్. అన్నాతమ్ముళ్లకు రాఖీ కట్టి ఆడపడుచులు ప్రేమను చాటుకునే ఈ పండగపూటే హృదయవిధారక ఘటన ఒకటి చోటుచేసుకుంది. గుండెపోటుతో చనిపోయిన అన్నకు చివరిసారిగా రాఖీ కట్టి సాగనంపిందో ఆడపడుచు. గుండెలు పగిలేలా అన్న మృతదేహాన్ని పట్టుకుని రోదిస్తూనే ఆ చెల్లి రాఖీ కట్టడం అక్కడున్నవారిని సైతం కన్నీరు పెట్టించింది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మంఢలం దూళికట్ట గ్రామానికి చెందిన చౌదరి కనకయ్య, గౌరమ్మ అన్నాచెల్లెల్లు. ఒకే తల్లి కడుపున పుట్టిన ఈ అన్నాచెల్లి ప్రేమానురాగాలతో ఆప్యాయంగా వుండేవారు. ఇవాళ రక్షా బంధన్ కావడంతో అన్నకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వచ్చింది గౌరమ్మ. కానీ పండగ పూటే కనకయ్య గుండెపోటుతో కుప్పకూలి మృతిచెందాడు. రాఖీ కడదామని వచ్చిన చెల్లి అన్న మృతదేహాన్ని చూసి షాకయ్యింది.
వీడియో
విగతజీవిగా పడివున్న తోడబుట్టినవాడి చూసి గౌరమ్మ గుండె పగిలేలా ఏడిచింది. అన్నకు కడదామని తెచ్చిన రాఖీని చివరకు అతడి మృతదేహానికి కట్టింది. ఎంతో ఆనందంగా పుట్టింటికి వచ్చిన ఆ చెల్లి శోకసంద్రంలో మునిగి రాఖీ పండగ చేసుకోవాల్సి వచ్చింది. పుట్టెడు దు:ఖంతో అన్న కన్నకయ్యకు చివరిసారి రాఖీ కట్టిన చెల్లి గౌరమ్మ స్మశానానికి సాగనంపింది. ఇలాంటి కష్టం ఏ చెల్లికీ రాకూడదంటూ గుండలు అవిసేలా రోదించింది గౌరమ్మ.
