తెలంగాణలోని సిద్దిపేట జిల్లా జాతీయ స్థాయిలో సత్తా చాటింది. మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్-2019 అవార్డుకు ఎంపిక చేసింది.
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా జాతీయ స్థాయిలో సత్తా చాటింది. మిషన్ ఇంద్రధనుష్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం.. సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్-2019 అవార్డుకు ఎంపిక చేసింది. చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం మిషన్ ఇంద్రధనుష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం అమలులో సిద్దిపేట జిల్లా సత్తా చాటింది. చిన్నారులకు 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన జిల్లాగా సిద్దిపేట నిలిచింది.
దీన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ‘మిషన్ ఇంద్ర ధనుష్’ కేటగిరీలో సిద్దిపేట జిల్లాను ప్రైమ్ మినిస్టర్ అవార్డ్ -2019 కి ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్ 21న ఢిల్లీలో జరిగే ‘సివిల్ సర్వీసెస్ డే’ కార్యక్రమంలో ట్రోపీతో పాటు రు.10 లక్షల నగదు ప్రోత్సాహాన్ని కేంద్ర ప్రభుత్వం సిద్దిపేట జిల్లాకు అందిస్తుంది.
ఇక, సిద్దిపేట జిల్లాకు ఈ అవార్డు రావడం పట్ల వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులు, సిబ్బందిని అభినందించారు. రాష్ట్రంలోని ప్రతిచిన్నారికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేలా సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య శాఖ కృషి చేస్తుందన్నారు.
