ములుగు జిల్లాలో కానిస్టేబుల్ హత్యకు ఎస్ఐ ప్లాన్.. మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించేలా స్కెచ్!
ములుగు జిల్లాలో కానిస్టేబుల్ హత్యకు ఏఆర్ ఎస్ఐ ప్లాన్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకోసం ఎస్ఐ ఓ మాజీ నక్సలైట్కు సుపారీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
ములుగు జిల్లాలో కానిస్టేబుల్ హత్యకు ఏఆర్ ఎస్ఐ ప్లాన్ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇందుకోసం ఎస్ఐ ఓ మాజీ నక్సలైట్కు సుపారీ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తద్వారా మావోయిస్టులు ఉన్నారనే భ్రమ కల్పించి.. ఆ తర్వాత తనకు సహకరించిన వారిని ఎన్కౌంటర్ చేసి అధికారుల మెప్పు పొందాలని చూసినట్టుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్లోని పోలీసు ఇంటెలిజెన్స్ విభాగం దీన్ని పసిగట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సాంకేతికతో కొన్ని ఆధారాలను సేకరించిన అధికారులు.. పోలీసులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలోనే ఆ ఏఆర్ ఎస్ఐతో పాటు మరో ఇద్దరిని పోలీసుల స్పెషల్ టీమ్ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.
వివరాలు.. ఏఆర్ ఎస్ఐ మావోయిస్టులు మాదిరిగా ఓ దళాన్ని ఏర్పాటు చేసేందుకు కుట్ర పన్నాడు. ఇందుకు ఓ మాజీ నక్సలైట్ సాయం తీసుకున్నాడు. నక్సలైట్లు ఉన్నారనే భ్రమ కల్పించేలా ఓ కానిస్టేబుల్ను హత్య చేయించేందుకు ప్లాన్ వేశాడు. ఇందుకోసం ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవుల్లో ట్రయల్స్ కూడా నిర్వహించారు.
తాను ఏర్పాటు చేసుకున్న దళం చేత కానిస్టేబుల్ను హత్య చేయించి.. ఆ తర్వాత వారిని కూడా అంతం చేయాలని సదరు ఎస్ఐ ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. వారు తననకు కలిసేందుకు సమయంలో ఎన్కౌంటర్ చేయాలని ఎస్ఐ కుట్ర పన్నినట్టుగా ప్రచారం సాగుతుంది. తద్వారా పోలీసు ఉన్నతాధికారుల మెప్పు పొందాలని అతడు చూసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని హైదరాబాద్లో నిఘా విభాగం పసిగట్టడంతో ఎస్ఐ కుట్ర భగ్నమైంది. అయితే ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారని.. ఇందుకు సంబంధించి అన్ని కోణాల్లో పూర్తి సమాచారం సేకరిస్తున్నారని తెలుస్తోంది.