కేసీఆర్ కి షాక్... పార్టీని వీడిన మరో సీనియర్
ఉద్యమ కాలంలో బీసీ కులాలకు 65శాతం పదవులు కల్పించిన పార్టీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టసభల్లో కల్పించకపోవడం శోచనీయమన్నారు.
వరంగల్ జిల్లాలో కేసీఆర్ కి షాక్ తగిలింది. పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత పార్టీని వీడారు. వరంగల్ రూరల్ నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి, తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గుండాల మదన్కుమార్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు రాసిన బహిరంగ లేఖను విడుదల చేశారు.
మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నానని, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జిల్లా అధ్యక్షుడిగా తెలంగాణలో బీసీ కులాలను ఏకం చేశానని అన్నారు. ఉద్యమ కాలంలో బీసీ కులాలకు 65శాతం పదవులు కల్పించిన పార్టీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత చట్టసభల్లో కల్పించకపోవడం శోచనీయమన్నారు.
రాష్ట్రంలో 56శాతం ఉన్న బీసీలకు కేవలం 20 అసెంబ్లీ సీట్లు కేటాయించడం సరికాదన్నారు. బీసీలకు ప్రాధాన్యం దక్కకపోవడంతోనే పార్టీకి దూరం అవుతున్నానని అన్నారు. మాలాంటి నాయకుల అవసరం పార్టీకి అవసరం లేదని భావించి, నర్సంపేట నియోజకవర్గంలో బీసీ కులాల ప్రతినిధిగా ఉండడానికి నిర్ణయించుకుని టీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.