హైద్రాబాద్లోని పలు కోర్టుల్లో జడ్జిలకు కరోనా: ఆన్లైన్లోనే కేసుల విచారణ
తెలంగాణలోని పలు కోర్టుల్లోని న్యాయమూర్తులకు కరోనా సోకింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.
హైదరాబాద్: తెలంగాణలోని పలు కోర్టుల్లోని న్యాయమూర్తులకు కరోనా సోకింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. హైద్రాబాద్ నగరంలోని నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సిటీ సివిల్ కోర్టు, సిటీ స్మాల్ కాజెస్ కోర్టులతో పాటు రంగారెడ్డి జిల్లా కోర్టుల పరిధిలో పలువురు న్యాయమూర్తులు కరోనా బారినపడ్డారు.
జడ్జిలతో పాటు పలువురు న్యాయవాదులు కూడ కరోనాకు గురయ్యారు. పదుల సంఖ్యలో కోర్టు సిబ్బందికి కూడ కోవిడ్ కు బారినపడ్డారు.కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో నాంపల్లి మెట్రోపాలిటజన్ సెషన్స్ జడ్జి తుకారాంజీ హైకోర్టుకు లేఖ రాశారు.కేసుల భౌతిక విచారణను నిలిపివేయాలని హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వెంకటేశ్వర్ రెడ్డి సోమవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది జూన్ లో కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో ఉన్నప్పటి ఆదేవాలను అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో సూచించారు.
జంటనగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని కోర్టుల్లో కేసులను భౌతికంగా విచారించరు. ముఖ్యమైన తుది వాదనల సమయంలో ఉన్న 20 కేసులను మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉంది.ఆయా కేసుల్లో కక్షిదారులు హాజరుకాకపోయినా ప్రతికూలమైన ఆదేశాలు జారీచేయరాదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలుచేస్తారు. అయితే ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో రోజూవారీగా విచారణ చేయాల్సిన అవసరం లేదని, కోర్టు వీలును బట్టి కేసులను పరిష్కరించాలని స్పష్టంచేశారు.