ఫిరాయింపుల పుకార్లు: సబితా ఇంద్రారెడ్డి, వనమా మాటలు ఇవే...
త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నేపథ్యంలో అదేబాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా క్యూ కడతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
రంగారెడ్డి: త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి జంప్ అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన నేపథ్యంలో అదేబాటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా క్యూ కడతారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.
మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల నేపథ్యంలో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సబితా ఇంద్రారెడ్డి కార్యకర్తలతో సమావేశమయ్యారు. తాను పార్టీ మారతారంటూ వస్తున్న వార్తలను ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం లేదని సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానంటూ చెప్పుకొచ్చారు.
మరోవైపు తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొట్టిపారేశారు. తాను ఎట్టిపరిస్థితుల్లో పార్టీ వీడేది లేదని కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానన్నారు. ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.