రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరనున్నారు. అందుకు బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్త పార్టీ పెడితే ఎదురయ్యే చిక్కులను పరిగణనలోకి తీసుకుని ప్రవీణ్ కుమార్ బిఎస్పీ వైపు మొగ్గుచూపినట్లు తెలుస్తోంది.

హైదరాబాద్: ఇటీవల పదవీ విరమణ చేసిన ఐపిఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఎస్పీలో చేరనున్నారు. ఈ విషయాన్ని బిఎస్పీ అధ్యక్షురాలు మాయావతి చెప్పారు. తెలంగాణ గురుకులాల కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ కుమార్ ఇటీవల స్వచ్ఛందా పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రవీణ్ కుమార్ కు బిఎస్పీ అధినేత్రి మాయావతి ఆఫర్ ఇచ్చినట్లు ఇంతకు ముందు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ప్రవీణ్ కుమార్ కు తెలంగాణ బిఎస్పీ అధ్యక్ష పదవిని ఇవ్వడానికి ఆమె సిద్ధఫడినట్లు వార్తలు వచ్చాయి. అదే ఇప్పుడు నిజం కాబోతోంది.

స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత ప్రవీణ్ కుమార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. స్వేరోలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వస్తున్నారు. ఆయన స్వేరో అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఇందులో దాదాపు 50 వేల మంది సభ్యులున్నారు. 

ఫూలే, అంబేడ్కర్ సిద్ధాంతంతో తాను ముందుకు సాగుతానని ప్రవీణ్ కుమార్ తాను రాజీనామా చేసినప్పుడు చెప్పారు. సొంత రాజకీయ పార్టీ పెట్టాలని ఆయన ఆలోచించారు. అయితే, అందుకు తగిన సాధనసంపత్తిని సమకూర్చుకోవడం ఇబ్బంది అవుతుందనే భావనతో ఆయన వెనక్కి తగ్గినట్లు చెబుతున్నారు. 

బిఎస్పీలో చేర్చుకునేందుకు మాయావతి ఆమోదం తెలిపారు. దీంతో త్వరలో ఆయన బిఎస్పీలో చేరనున్నారు.