హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
సిమెంట్ రెడీమిక్స్ వాహనం వేగంగా వెళుతూ బైక్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.
హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమెంట్ రెడీమిక్స్ వాహనం వేగంగా వెళుతూ బైక్ ను ఢీ కొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మృతులందరు మహారాష్ట్రకు చెందినవారిగా సమాచారం.
ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రకు చెందిన కమృద్దీన్, జమీల్, బబ్లు ఉపాధి నిమత్తం హైదరాబాద్ కు వలస వచ్చారు. వీరు శివారు ప్రాంతమైన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లిలో నివాసముంటున్నారు. ఈ క్రమంలోనే శనివారం అర్థరాత్రి ముగ్గురు కలిసి బైక్ పై వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు.
వీరు ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ ను ఎదురుగా వేగంగా వచ్చిన సిమెంట్ మిక్స్ లారీ ఢీ కొట్టింది. దీంతో ఎగిరి రోడ్డుపైపడ్డ ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.