ప్రజాగాయకుడు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గద్దర్ అంతిమయాత్రలో భారీగా కళాకారులు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
హైదరాబాద్: ప్రజాగాయకుడు గద్దర్ అంతిమయాత్ర ప్రారంభమైంది. గద్దర్ అంతిమయాత్రలో భారీగా కళాకారులు, అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఎల్బీ స్టేడియం నుంచి ఆశ్రునయనాలతో గద్దర్ అంతిమ యాత్ర అల్వాల్లోని ఆయన నివాసం వరకు సాగనుంది. గన్పార్క్, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపం, ట్యాంక్బండ్, జేబీఎస్, తిరుమలగిరి మీదుగా గద్దర్ అంతిమ యాత్ర సాగనుంది. అల్వాల్లోని నివాసంలో కొద్దిసేపు గద్దర్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
అక్కడ కార్యక్రమాలు పూర్తైన తర్వాత గద్దర్ స్థాపించిన అల్వాల్లోని మహాబబోధి విద్యాలయం ఆవరణలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. గద్దర్ కోరిక మేరకే విద్యాలయ గ్రౌండ్లో అంత్యక్రియలు చేసేందుకు నిర్ణయించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక, గద్దర్కు కడసారి నివాళులర్పించేందుకు అభిమానులు, బంధువులు, పలువురు ప్రముఖులు అల్వాల్కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే అల్వాల్ భూదేవి నగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు.
Also Read: ప్రజా గాయకుడు గద్దర్ పార్థివ దేహానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళులు.. (ఫొటోలు)
Also Read: 25 ఏళ్లకు పైగా శరీరంలో బుల్లెట్తోనే గద్దర్ జీవనం.. 1997లో అసలు ఏం జరిగింది..?
ఇక, పొడుస్తున్న పొద్దు అస్తమించింది. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గద్దర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం గద్దర్ పార్థివదేహాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియంకు ఉంచారు. ఎల్బీ స్టేడియంలో ప్రజాగాయకుడు గద్దర్ పార్థివ దేహానికి పలువురు నాయకులు, ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించారు. పలువురు కళాకారులు గద్దర్ పాటలతో ఆయనకు నివాళులర్పించారు.
