కేసీఆర్ తర్వాతి టార్గెట్ జగదీష్ రెడ్డి?: రేవంత్ రెడ్డి ట్వీట్ సంచలనం
మంత్రి జగదీష్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదిక చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. జగదీష్ రెడ్డిని కేసీఆర్ తదుపరి లక్ష్యంగా ఎంచుకున్నారనే వార్తాకథనం నేపథ్యంలో ఆయన ట్వీట్లు చేశారు.
హైదరాబాద్: విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఆంగ్ల పత్రిక దక్కన్ క్రానికల్ లో వచ్చిన ఓ వార్తాకథనాన్ని జోడిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ఈటెల రాజేందర్ తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ జగదీష్ రెడ్డేనని దక్కన్ క్రానికల్ వార్తాకథనం విశ్లేషిచింది.
దాంతో జగదీష్ రెడ్డిని ఉద్దేశిస్తూ రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్య చేశారు. "రస" కందాయంలో హంపీ "థూమ్ ధామ్..: కోవర్ట్ క్రాంతి కిరణాలతో కకావికలం... యముడు జగదీశ్ రెడ్డి ఘంటా కొట్టినేట్టేనా....? అంటూ రేవంత్ రెడ్డి ట్వీట్ కొనసాగింది.
ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఆ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. టీఆర్ఎస్ లో సంచలనమైన సంఘటన చోటు చేసుకుంటుందని చెప్పడానికి ఈ ట్వీట్ సంకేతమని అంటున్నారు.
జగదీష్ రెడ్డి తన కుమారుడి జన్మదిన వేడకులను కర్ణాటలో నిర్వహించారని, ఇందులో కేసీఆర్ కు వ్యతిరేకమైన బాతఖానీ సాగిందని, ఈ విషయం కేసీఆర్ దృష్టికి వచ్చిందని దక్కన్ క్రానికల్ రాసింది. అందువల్ల జగదీష్ రెడ్డిని ఈటెల రాజేందర్ లాగానే కేసీఆర్ మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలున్నాయని, ఆయన స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డికి మంత్రి పదవి ఇస్తారని ఆ పత్రిక రాసింది. రేవంత్ రెడ్డి ఆ వార్తాకథనాన్ని తన ట్వీట్ కు జోడించారు.