తెలంగాణ బీజేపీ పరిస్థితులపై ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ  జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. బీజేపీలో నేతల మధ్య ఉన్న విబేధాలు ఈ ట్వీట్‌తో బయటపడ్డాయని.. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణ బీజేపీ పరిస్థితులపై ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఆ ట్వీట్‌లో దున్నపోతును వెనకాల నుంచి కాలుతో తన్నుతూ ట్రాలీ ఎక్కిస్తున్న వీడియోను షేర్ చేసిన జితేందర్ రెడ్డి.. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని ఇంగ్లీష్‌లో పేర్కొన్నారు. ఆ ట్వీట్‌లో బీఎల్ సంతోష్, బీజేపీ పార్టీ, అమిత్ షా, సునీల్ బన్సల్, తెలంగాణ బీజేపీ ట్విట్టర్ ఖాతాలను ట్యాగ్‌ చేశారు. అయితే ఈ ట్వీట్ కాస్తా వివాదస్పదంగా మారడంతో.. జితేందర్ రెడ్డి వెంటనే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆ తర్వాత ఏమైందో కానీ.. మళ్లీ అదే ట్వీట్‌ను పోస్టు చేశారు. 

అంతేకాకుండా తన ట్వీట్‌పై వివరణ ఇస్తూ మరో పోస్టు చేశారు. టీ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించే వాళ్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చెప్పే ప్రయత్నాన్ని.. తప్పుగా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు. ‘‘కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే... బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగ అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి’’ అని జితేందర్ రెడ్డి ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అయితే జితేందర్ రెడ్డి షేర్ చేసిన వీడియో, అక్కడ ఇంగ్లీష్‌ పేర్కొన్న ట్వీట్ మాత్రం.. బీజేపీకి వ్యతిరేక వైఖరిని ప్రతిబింబిస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీలో నేతల మధ్య ఉన్న విబేధాలు ఈ ట్వీట్‌తో బయటపడ్డాయని.. ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ క్రమంలోనే జితేందర్ రెడ్డి ట్వీట్‌పై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. తెలంగాణ బీజేపీపై సెటైర్లు వేశారు. బీజేపీ అంతర్గత ‘తన్నులాట’ను అద్భుతమైన పోలికతో జితేందర్ రెడ్డి ప్రజలకు వివరించారని చెప్పుకొచ్చారు. ఆ పార్టీలో చేరిన వారి పరిస్థితి గురించి ఇంత కంటే గొప్పగా ఎవరూ చెప్పలేరని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. 

Scroll to load tweet…


Scroll to load tweet…

ఇక, ఇటీవల రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు.. గతంలో కాంగ్రెస్‌ను వీడిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే పార్టీ సిద్దాంతాలకు అనుగుణంగా.. బలమైన నేతలను కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నాల్లో ఉంది.