లోక్సభ స్థానాలపై కన్నేసిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమౌతున్నారు.
హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమౌతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కనికరించని ఓటర్లు పార్లమెంట్ ఎన్నికల్లో తమను కనికరిస్తారనే ఆశాభావంతో ఉన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ విజయాన్ని సాధించింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ దఫా నల్గొండ నుండి పార్లమెంట్ స్థానానికి పోటీ చేయనున్నారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సన్నాహాలు చేసుకొంటున్నారు. ఈ దపానే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. అయితే అసెంబ్లీ రద్దు కావడంతో ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆయన మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.
కొడంగల్ నుండి పోటీ చేసి ఓటమి పాలైన రేవంత్ రెడ్డి ఈ దఫా మహాబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి మామ జైపాల్ రెడ్డి కూడ ఈ స్థానం నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికి మహాబూబ్ నగర్ స్థానం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తోందో చూడాలి. మహబూబ్నగర్ ఎంపీ స్థానాన్ని మాజీ మంత్రి డీకె అరుణ కూడ ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. డికె అరుణ లేదా ఆమె కూతురు స్నిగ్థారెడ్డి కూడ పోటీకి ఆసక్తిగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ హేమా హేమీలు బరిలోకి దిగేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి రేణుకాచౌదరి ఈ ధఫా బరిలోకి దిగనున్నారు. చేవేళ్ల నుండి సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తారు.గత ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.అసెంబ్లీ ఎన్నికల ముందు కొడా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి జీవన్ రెడ్డి పోటీ చేసే చాన్స్ ఉంది. అయితే గతంలో ఈ స్థానం నుండి పొన్నం ప్రభాకర్ పోటీ చేసి విజయం సాధించారు. ఈ దఫా పొన్నం ప్రభాకర్ అసెంబ్లీకి పోటీ చేశారు. అయితే పొన్నం మరోసారి కరీంనగర్ నుండి పోటీ చేస్తారా లేదా ఇతర నేతలకు అవకాశాన్ని ఇస్తారా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
నిజామాబాద్ నుండి మాజీ ఎంపీ మదు యాష్కీ పోటీ చేయనున్నారు. మహబూబాబాద్ నుండి బలరామ్ నాయక్ , జహీరాబాద్ నుండి సురేష్ షెట్కార్ పోటీ చేయనున్నారు. సికింద్రాబాద్ నుండి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే గతంలో ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించిన అంజన్ కుమార్ యాదవ్ ఈ స్థానాన్ని అజారుద్దీన్ కు ఇస్తే ఒప్పుకొంటారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ నుండి 2009లో ఆదిలాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన రమేష్ రాథోడ్ ఆదిలాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా టిక్కెట్టు ఆశిస్తున్నారు.ఇటీవలనే ఆయన ఖానాపూర్ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.సోయం బాపూరావు పేరు కూడ ఈ స్థానం నుండి ప్రముఖంగా విన్పిస్తోంది.