కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై (Himanta Biswa Sarma) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (Jubilee Hills Police Station) కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, దాసోజు శ్రావణ్‌లు ఫిర్యాదు చేశారు. 

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై (Himanta Biswa Sarma) తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం సీఎంపై తెలంగాణలోని పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో (Jubilee Hills Police Station) అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, షబ్బీర్ ఆలీ, దాసోజు శ్రావణ్‌.. లు ఫిర్యాదు చేశారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ అధిష్టానం హిమంత బిశ్వ శర్మను ముఖ్యమంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం స్పందిస్తారని చూశామని.. కానీ అలా జరగలేదని తెలిపారు. నిసిగ్గుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అస్సాం సీఎం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీపై చేసినవి కావాని.. మాతృమూర్తులపై చేసిన దాడి అని అన్నారు. మహిళలను అవమానించేలా మాట్లాడిన అస్సాం సీఎంపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాతృమూర్తులకు జరిగిన అవమానంపై తాము ఫిర్యాదు చేశామని చెప్పారు.

రెండు రోజుల నుంచి సీఎం కేసీఆర్ అస్సాం సీఎం వ్యాఖ్యలపై, బీజేపీ దుర్మర్గాలపై మాట్లాడుతున్నారని.. ఇది నిజమైతే తెలంగాణ పోలీసులపై ఒత్తిడి లేకుండా ఫిర్యాదులపై చర్యలు తీసుకునేలా చూడాలన్నారు. తాము ఫిర్యాదు చేసినట్టుగా జూబ్లీహిల్స్ పోలీసులు రసీదు ఇచ్చారని చెప్పారు. వెంటనే అస్సాం సీఎంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణ నుంచి ప్రత్యేక పోలీసు బలగాలను పంపి హిమంత బిశ్వ శర్మను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉందన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే.. ఎన్నికల నియామళిని ఉల్లంఘించి, మహిళలను కించపరిచిన అస్సాం సీఎంను అరెస్ట్ చేయించేందుకు స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని అస్సాం సీఎంను శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

తమ ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం 48 గంటల సమయం ఇస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకవేళ చర్యలు తీసుకోకుంటే.. కాంగ్రెస్ శ్రేణులు 16వ తేదీ మధ్యాహ్నం రాష్ట్రంలోని కమిషనరేట్‌ల, ఎస్పీ కార్యాలయాలను ముట్టడిస్తామని తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్ ముందు నిరసనకు తాను నేతృత్వం వహిస్తానని చెప్పారు.