హఫీజ్పేట్ భూవివాదమే కిడ్నాప్నకు కారణం: బాధితుల బంధువు ప్రతాప్ రావు
బోయిన్పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ వ్యవహారానికి హాఫీజ్ పేటలోని 50 ఎకరాల భూ వివాదమే కారణమని బాధితుల తరపు బంధువు ప్రతాప్ రావు చెప్పారు.
హైదరాబాద్: బోయిన్పల్లిలో ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరుల కిడ్నాప్ వ్యవహారానికి హాఫీజ్ పేటలోని 50 ఎకరాల భూ వివాదమే కారణమని బాధితుల తరపు బంధువు ప్రతాప్ రావు చెప్పారు.
బుధవారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. ఈ భూమికి చాలా మంది పార్ట్నర్స్ ఉన్నారని చెప్పారు. ఈ భూమికి సుప్రీంకోర్టు క్లియరెన్స్ అన్నీ ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
భూమా కుటుంబానికి వాళ్ల పార్ట్నర్స్ మధ్య విభేధాలు కిడ్నాప్ వరకు వచ్చాయన్నారు. వారి పార్ట్నర్స్ తో తేల్చుకోవాలని భూమా వర్గానికి చెప్పామన్నారు. ఈ విషయమై రెండేళ్ల క్రితమే భూమా కుటుంబం తమను సంప్రదించారన్నారు. అప్పుడే అన్ని డాక్యుమెంట్లు చూపించినట్టుగా చెప్పారు. అయినా కూడ భూమా కుటుంబం మళ్లీ తమ మీదికే వివాదానికి వచ్చిందన్నారు.
మంగళవారంనాడు రాత్రి ప్రవీణ్ రావు అతని సోదరులు సునీల్ రావు, నవీన్ రావు లను బోయిన్ పల్లిలో కిడ్నాప్ చేశారు. ఐటీ అధికారులుగా నమ్మించిన దుండగులు మూడు కార్లలో వారిని కిడ్నాప్ చేశారు.
బుధవారం నాడు తెల్లవారుజామున కిడ్నాపర్లు ఈ ముగ్గురిని నగర సమీపంలో వదిలారు. కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇదే కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియతో పాటు ఆమె భర్త భార్గవ్ రామ్ ను కూడ పోలీసులు అరెస్ట్ చేశారు.