ఆరుగురు మహిళలతో వివాహం: హైదరాబాదు పోలీసులకు చిక్కిన నిత్య పెళ్లి కొడుకు
నిత్య పెళ్లి కొడుకును హైదరాబాదు పోలీసులు గోవాలో ఓ మహిళతో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాదు తీసుకుని వచ్చారు. అతను ఆరుగురు మహిళలను పెళ్లి చేసుకుని మోసం చేసినట్లు గుర్తించారు.
హైదరాబాద్: ఓ నిత్య పెళ్లి కొడుకును హైదరాబాదు పోలీసులు అరెస్టు చేశారు. రంగస్వామి అనే ఆ నిత్య పెళ్లి కొడుకును గోవాలో అరెస్టు చేసి హైదరాబాదు తీసుకుని వచ్చారు. గోవాలో ఓ మహిళతో ఉండగా అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాదులోని ఓ మహిళకు సంబంధించిన కేసులో అతన్ని విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి.
మహిళలను మోసం చేయడంలో దిట్టగా పేరు మోసిన రంగస్వామి ఇప్పటి వరకు ఆరుగురు మహిళలను వివాహం చేసుకున్నట్లు తేలింది. రంగస్వామి హైదరాాబదు వచ్చి లాలాగుడాలో నివాసం ఉంటున్నాడు. అప్పటి నుంచి మహిళలను మోసం చేయడంలో మునిగిపోయాడు.
అతనిపై దొమ్మీలు, చైన్ స్నాచింగ్ వంటి 12 కేసులు నమోదయ్యాయి. ఓ కేసులో అతను రెండేళ్లు జైలులో ఉండి బయటకు వచ్చాడు. వివాహమైన మహిళలను లక్ష్యంగా ఎంచుకుని వారిని మోసం చేసేవాడని సమాచారం. మహిళలను వివాహం చేసుకుని వారి వద్ద పెద్ద మొత్తంలో సొమ్ము రాబట్టి మోజు తీరిన తర్వాత వదిలేయడం అతనికి అలవాటుగా మారిందని అంటున్నారు.