కరోనా కట్టడికి పటిష్ట చర్యలు: టాప్-50 బెస్ట్ ఐఏఎస్లలో రంగారెడ్డి కలెక్టర్కు స్థానం
దేశంలో పరిపాలన అంతా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉందని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవంగా దేశాన్ని పాలించేది ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత ఉద్యోగులే. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలు పరిష్కరించి ఎంతోమంది సివిల్ సర్వీసుల మన్ననలు పొందారు.
దేశంలో పరిపాలన అంతా రాజకీయ నాయకుల చేతుల్లోనే ఉందని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవంగా దేశాన్ని పాలించేది ఐఏఎస్, ఐపీఎస్ వంటి అఖిల భారత ఉద్యోగులే. ప్రజలతో నేరుగా మమేకమై, వారి సమస్యలు పరిష్కరించి ఎంతోమంది సివిల్ సర్వీసుల మన్ననలు పొందారు.
ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ ఫేమ్ ఇండియా దేశవ్యాప్తంగా చేసిన సర్వేలో 50 మంది ఐఏఎస్లను ఎంపిక చేసింది. వీరిలో తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఐఏఎస్లు కూడా స్థానం దక్కించుకున్నారు. వీరిలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కాగా, మరొకరు కరీంనగర్ కలెక్టర్ శశాంక ఉన్నారు.
గత 4 నెలల పనితీరు ఆధారంగా ఫేమ్ ఇండియా వీరిద్దరిని ఎంపిక చేసింది. కరోనా నియంత్రణలో భాగంగా ఈ రెండు జిల్లాల కలెక్టర్లు రేయింబవళ్లు అప్రమత్తంగా ఉండి.. ప్రజల్లో చైతన్యం కలిగించారని ఫేమ్ ఇండియా ప్రశంసించింది. దీనితో పాటు జిల్లా అంతటా జాగ్రత్తలు పాటించేలా కఠిన చర్యలు తీసుకున్నారని పేర్కొంది.
ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కరోనా కట్టడికి వినూత్న పద్దతులను అవలంభించారు. ట్రేస్, టెస్ట్, ఐసొలేట్, సపోర్ట్ అనే విధానాన్ని జిల్లా అంతటా అమలు చేసి కరోనా కట్టడికి చర్యలు చేపట్టారు.
ఎక్కడికక్కడ కరోనా కేసు నమోదు అయినా ప్రాంతాన్ని ఐసొలేట్ చేసి ఆ ప్రాంతంలో ఆ కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రేస్ చేసి వారిని ఐసొలేట్ చేసి వారికి అన్ని రకాలుగా మద్దతుగా నిలిచారు.
అనంతరం పరీక్షలు చేసి పాజిటివ్ వచ్చిన వారిని ఆసుపత్రికి తరలించారు. అలాగే కోవిడ్ 19 సోకినట్లు నిర్థారణ అయిన వారితో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రేస్ చేసి క్వారంటైన్ చేశారు. ఈ విధంగా జిల్లా యంత్రాంగానికి తగు సూచనలు ఇచ్చి సత్ఫలితాలు రాబట్టారు.
రంగారెడ్డి జిల్లాలో తెలంగాణకి కీలక ఆర్ధిక వనరులను అందించే ఐటి పరిశ్రమ, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉండటంతో అమయ్ కుమార్ పాజిటివ్ కేసులు వచ్చిన ప్రాంతాల్లో కఠినమైన నిబంధనలు అమలు చేస్తూ వచ్చారు.
దీనితో పాటు జిల్లా అంతటా వలస కార్మికుల విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నారు. ఆయన చేసిన కృషికి గాను దేశంలోని ఉత్తమ ఐఏఎస్ అధికారుల్లో ఒకరిగా ఎంపికయ్యారు.