రామగుండం ఫ్యాక్టరీ నుండి కిసాన్ బ్రాండ్ యూరియా: మంత్రి కిషన్ రెడ్డితో అధికారులు
రామగుండం ప్లాంటుకు సంబంధించి కిసాన్ బ్రాండ్ యూరియా పేరుతో ఉత్పత్తిని ఈ ఏడాది నవంబర్ నుండి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. ప్లాంట్ నిర్మాణ దశలో ప్రభుత్వాల సహకారం ఉందని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
న్యూఢిల్లీ: రామగుండం ప్లాంటుకు సంబంధించి కిసాన్ బ్రాండ్ యూరియా పేరుతో ఉత్పత్తిని ఈ ఏడాది నవంబర్ నుండి ప్రారంభిస్తామని అధికారులు ప్రకటించారు. ప్లాంట్ నిర్మాణ దశలో ప్రభుత్వాల సహకారం ఉందని ఆ సంస్థ అధికారులు తెలిపారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి గురువారం రామగుండం ఫెర్టిలైజర్, కెమికల్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ విషయాలపై ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సమావేశంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్, రామగుండం ఫెర్టిలైజర్ కెమికల్స్ లిమిటెడ్ కార్యనిర్వాహక సంచాలకులు రాజన్ థాపర్, జనరల్ మేనేజర్ వి. కె. బంగార్ లతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అదనపు ప్రైవేట్ కార్యదర్శి శశికిరణాచారి పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ప్రాజెక్ట్ నిర్మాణ పనుల పురోగతి, స్థానికులకు కల్పించిన ఉపాధి అవకాశాలు, రైతులకు యూరియా అందుబాటులోకి తెచ్చే తదితర
అంశాలపై కిషన్ రెడ్డి, ఆర్.ఎఫ్.సి.ఎల్ సంస్థ ఉన్నత అధికారులతో చర్చించారు.
రామగుండం ఫెర్టిలైజర్స్ ప్లాంట్ నిర్మాణ దశ, ఉత్పత్తి ప్రారంభంపై మంత్రి కిషన్ రెడ్డి వివరణ కోరారు.రామగుండం ప్లాంట్ కు సంబంధించి మొత్తం 460 మంది పర్మనెంట్ ఉద్యోగులగాను ఇప్పటికే 278 మంది ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేశామని మరి కొంతమందిని త్వరలోనే భర్తీ చేస్తామని అధికారులు తెలియజేశారు.
నవంబర్ నెలలో ఉత్పత్తిని ప్రారంభించబోతున్న రామగుండం ప్లాంటు పరోక్షంగా వెయ్యి మందికి ఉపాధి కల్పిస్తుందని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్లాంటు భద్రతకు సంబంధించి సిఐఎస్ఎఫ్ భద్రత కల్పించాలని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా దానిపై సత్వరమే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి తెలిపారు.
ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాలో సుమారు 55 కోట్లు సమకూర్చాల్సి ఉందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. త్వరలో కేంద్ర మంత్రి సదానంద గౌడతో సమీక్షా సమావేశం నిర్వహించి సెప్టెంబర్ చివరి వారంలో రామగుండం ప్లాంటును సందర్శిస్తాననీ మంత్రి అధికారులకు తెలిపారు. ప్రాజెక్ట్ జనావాసాలకు దగ్గరగా ఉన్నందున ప్రమాదాలు జరగకుండా ఉన్నత భద్రతా ప్రమాణాలు పాటించాలని కిషన్ రెడ్డి ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు.
అలాగే రామగుండం ప్లాంట్లో ఉత్పత్తి అయ్యే యూరియాని తెలంగాణ రాష్ట్ర అవసరాలకు సరిపడా కేటాయింపులు చేయాలని మంత్రి కోరారు. ప్రస్తుత కోటా ప్రకారం రామగుండం కర్మాగారం ద్వారా సుమారు 50 శాతం ఎరువులు మాత్రమే తెలంగాణాకి కేటాయించి మిగతా ఇతర రాష్ట్రాలకి సరఫరా చేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు.
తెలంగాణాకి సంబంధించి తక్కిన అవసరాల నిమిత్తం పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్న విషయం మంత్రి దృష్టికి వచ్చింది. దీని విషయంలో ఎక్కడ ఉత్పత్తి అయిన ఎరువులు అక్కడి అవసరాలకు అనుగుణంగా వాడితే ఇతర రవాణా ఖర్చులు తగ్గే అవకాశం ఉందని ఈ విషయం పై అధికారులు దృష్టి సారించాలని కోరారు. అలానే స్థానికులకు ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు.