తెలంగాణకు మరో మూడు రోజులు వర్ష సూచన.. ఆ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ..
తెలంగాణలో మండు వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
తెలంగాణలో మండు వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న అకాల వర్షాలతో వాతవరణం చల్లబడినప్పటికీ.. పంటలు దెబ్బతినడంతో రైతులకు కన్నీరే మిగిలింది. రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. పలుచోట్ల పిడుగులు, వడగాళ్లతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్నగర్, వరంగల్, హన్మకొండ జిల్లాలో వడగళ్లతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదే సమయంలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో అక్కడక్కడ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.