తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. ఈ మేరకు 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపటి నుంచి జూలై 17 వరకు ఈ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు తెలిపింది.  

గత కొన్నిరోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్ధవుతున్న సంగతి తెలిసిందే. అనేక ప్రాంతాల్లో నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా.. లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం వుందన్న వార్తలలో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. 

ఈ మేరకు 15 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. రేపటి నుంచి జూలై 17 వరకు ఈ రైళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే తేదీ వరకు హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ రైళ్లను సైతం రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. 

మరోవైపు.. ఎడతెరిపి లేని వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని విద్యాసంస్థలకు శనివారం వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అలాగే నేడు జరగాల్సిన ఈసెట్ పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. అయితే ఎంసెట్ ఇంజనీరింగ్‌ పరీక్ష మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని వెల్లడించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఒక ప్రటన విడదల చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టుగా వెల్లడించారు. 

ALso Read:భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం: ఏడు మండలాలకు స్పెషల్ అధికారుల నియామకం

ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అగ్రికల్చర్ పరీక్షను మాత్రమే వాయిదా వేస్తున్నట్టుగా చెప్పారు. జూలై 14,15 తేదీల్లో జరగాల్సి ఉన్న ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ పరీక్ష నిర్వాహణకు సంబంధించిన కొత్త తేదీని త్వరలోనే వెల్లడించనున్నట్టుగా చెప్పారు. అయితే జూలై 18,19,20 తేదీల్లో జరగనున్న ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష యథావిథిగా కొనసాగనుందని తెలిపారు.

కాగా.. తెలంగాణలో మ‌రో మూడు రోజ‌లు పాటు భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఆదిలాబాద్‌, కుమురం భీమ్‌ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయ‌ని వాతావరణశాఖ తెలిపింది. ఆ జిల్లాల‌కు రెడ్ అలెర్ట్ ప్ర‌క‌టించింది. ఇక, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.