కోవిడ్ వ్యాక్సిన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకొని ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్ సీకి వెళ్లారు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో... అందరూ వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. కాగా... ఓ మహిళ కరోనా టీకా కోసం వెళితే... కుక్క కాటుకు వేసే రేబిన్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కట్టంగూరు మండలం బొల్లెపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పుట్ట ప్రమీల పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖ తీసుకొని ఆమె మంగళవారం ఉదయం 11 గంటలకు కట్టంగూరు పీహెచ్ సీకి వెళ్లారు.
పీహెచ్సీ భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా.. పక్కనే ఉన్న ఆయుష్ భవనంలో కోవిడ్ టీకాలు వేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమీల నేరుగా పీహెచ్ సీకి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళ నర్సు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసిందని.. కోవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకూ అదే సిరంజీతో యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిందని మహిళ ఆరోపించారు.
ఒకే సిరంజితో ఇద్దరికి వ్యాక్సిన్ ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో.. నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందన్నారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి ఆమెను వివరణ కోరగా... బాధితురాలు కరోనా టీకా బ్లాక్ లోకి కాకుండా.. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారని.. ఆమెకు కుక్క కరించిందని నర్సు పొరపాటు పడిందన్నారు. ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ వేయలని.. టీటీ ఇంజక్షన్ ఇచ్చామన్నారు. దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని చెప్పారు.
