ప్రజా యుద్దనౌక గద్దర్కు ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫోరం (పీడీఎఫ్) నివాళులర్పించింది.
ప్రజా యుద్దనౌక గద్దర్కు ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫోరం (పీడీఎఫ్) నివాళులర్పించింది. విద్యార్థి దశ నుంచి మరణించేవరకు అలుపెరుగని ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా మమేకమైన..తెలంగాణ సాంస్కృతిక ఉద్యమ, విప్లవ ఉద్యమ దృవ తార ‘‘కామ్రేడ్ గద్దర్ అన్నకు విప్లవ జోహార్లు అర్పిస్తున్నాం’’ అని పీడీఎఫ్ పేర్కొంది. ఈ మేరకు ఈ మేరకు కన్వీనర్ ఆర్ గురువారెడ్డి, ప్రొఫెసర్ కొండా నాగేశ్వర్, ప్రొఫెసర్ వినయ్ బాబు, ఇ రఘునందన్లు ప్రకటన విడుదల చేశారు.
విద్యార్థి దశలో విప్లవ రాజకీయాల వైపు ఆకర్షితులైన కామ్రేడ్ గద్దర్ సుదీర్ఘ కాలం పాటు పీడిత తాడిత ప్రజల పక్షాన పోరాటం జరిపారని గుర్తుచేశారు. సుదీర్ఘమైన ప్రజా జీవితంలో అతి కొద్ది కాలం మినహాయించి తనను తాను ప్రజలకు అంకితం చేసుకున్నారని.. ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పాట ప్రజా బహుళ్యంలో ఏ విధంగా, ఎన్ని రూపాలలో మలచాలో అన్ని రూపాల్లో మలచగలిగారని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట సిద్ధాంత భావజాల ప్రతిపాదికగా గద్దర్ అనేక ప్రజా పోరాటాలు నిర్మించారని.. తన గానం చేత మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణను ఐక్యం చేయగలిగారని చెప్పారు.
వర్గ పోరాటంలో సాంస్కృతిక ఉద్యమం ఎంత బలమైన ప్రభావం చూపిస్తుందో గద్దర్ తన పాట చేత మరొకసారి రుజువు చేశారని గుర్తుచేసుకున్నారు. 20వ శతాబ్దపు ప్రగతిశీల ఉద్యమ రాజకీయాలలో ఒక సాంస్కృతిక సేనానిగా తనను తాను మలుచుకున్నారని.. కుల అణచివేత, కుల దోపిడి, వర్గ దోపిడీలకు వ్యతిరేకంగా తన జీవితకాలం వివిధ పోరాటాలలో నిమగ్నమయ్యారని తెలిపారు. గద్దర్ మరణం ప్రజా పోరాటాలకు, సాంస్కృతిక ఉద్యమాలకు తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫోరం పక్షాన సంతాపాన్ని తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రజా ఉద్యమాలలో కొనసాగటమే వారికి అర్పించే నిజమైన నివాళిగా భావిస్తున్నామని తెలిపారు.
