తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ను రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు, వంచిత్ బహుజన్ అఘాడి (వీబీఏ) చీఫ్ ప్రకాష్ అంబేద్కర్ ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లాలో మేకను ఎత్తుకుపోయారని ఇద్దరు యువకులను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ప్రకాష్ అంబేద్కర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇద్దరు యువకులను తలకిందులుగా వేలాడదీసి కొందరు చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోను షేర్ చేసిన ప్రకాష్ అంబేద్కర్.. ఇది పూర్తిగా అనాగరికమని అన్నారు.
కుల దౌర్జన్యం అత్యంత క్రూరత్వాన్ని చూసి తాను భయపడిపోయానని చెప్పారు. ‘‘మనల్ని మనం మనుషులుగా భావించడం లేదా?.. మీ రాష్ట్రంలో ఏం జరుగుతోంది’’ అని కేసీఆర్ను ప్రకాష్ అంబేద్కర్ ప్రశ్నించారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం.. కేసీఆర్ హయాంలో తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలకు సంబంధించి మొత్తం 12,643 ఘటనలు చోటుచేసుకున్నాయని అన్నారు.
అసలేం జరిగిందంటే.. మంచిర్యాల జిల్లా మందమర్రిలో మేకను దొంగిలించారనే ఆరోపణలపై ఇద్దరు యువకులను చిత్రహింసలకు గురిచేశారు. నిందితులు కొమురాజుల రాములు, అతని భార్య స్వరూప, వారి కుమారుడు మందమర్రిలోని అంగడి బజార్కు చెందిన శ్రీనివాస్లు పట్టణ శివారులోని గంగనీళ్లపంపుల వద్ద మేకల మందను పెంచుతుండగా.. 20 రోజుల క్రితం వాటిలో ఒక మేక కనిపించకుండా పోయింది. అయితే 19 ఏళ్ల తేజ వారి వద్దే ఉంటూ పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. అయితే మేకను తేజ, అతని స్నేహితుడైన దళిత యువకుడు చిలుముల కిరణ్ దొంగిలించారని నిందితులు అనుమానించారు. ఈ క్రమంలోనే వారిపై దాడి చేసి.. తాళ్లతో తలకిందులుగా వేలాడదీసి కింద మంటపెట్టారు. కింద పొగ పెట్టి ఊపిరాడకుండా చేశారు.
తీవ్ర గాయాలపాలైన తేజ, కిరణ్ ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక, శుక్రవారం నుంచి కిరణ్ కనిపించకుండా పోవడంతో అతడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే శనివారం కిరణ్పై దాడి చేసిన ఫొటోలు బయటకు రావడంతో.. రాములుతో పాటు మరికొందరిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది.
