ప్రజా దీవెన యాత్ర పేరిట హుజురాబాద్ లో పాదయాత్ర చేస్తున్న బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు. 

హుజురాబాద్: ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో స్వరాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం కంటే ఎక్కువ నిర్భందం ప్రస్తుతం తెలంగాణలో ఉందని మాజీ మంత్రి, బిజెపి నాయకుడు ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్రంలో ప్రజలకు స్వేచ్చా, గౌరవం కరువయ్యాయని అన్నారు. ఇలా అహంకారపూరితంగా పాలన సాగిస్తున్న కేసీఆర్ ను గెలిపిస్తారా? ఆయన అహంకారంతో బలయ్యే పేదప్రజల గొంతుక అయిన ఈటల రాజేందర్ ను గెలిపిస్తారా? అని హుజురాబాద్ ప్రజలను అడిగారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రజా దీవెన యాత్ర పేరిట హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేస్తున్న ఈటల ఇవాళ(బుధవారం) వంగపల్లి గ్రామానికి చేరుకున్నారు. వర్షం కారణంగా పాదయాత్ర ఆలస్యం కావడంతో వంగపల్లి ప్రజలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... కరోనా కాలంలో తప్ప నిరంతరం హుజూరాబాద్ ప్రజలతో ఉన్నానని అన్నారు. 20 ఏళ్లుగా మీతోనే ఉన్నానన్నారు.

 read more మేమేమైనా నక్సలైట్లమా.. ఓవరాక్షన్ వద్దు: పోలీసులకు ఈటల వార్నింగ్

''నాకు తెలిసి ఎక్కడా తప్పు చేయలేదు. ఉప్పల్ లో 72 గంటలు రైలు పట్టాలమీద పడుకున్నా మీరంతా నాతోనే ఉన్నారు. 5 వేల మంది విద్యార్థులు చదువుకొనే లాగా విద్యా సంస్థలు కమలపూర్ లో ఏర్పాటు చేశాను. రాష్ట్రంలో చెక్ డాం లకు హుజూరాబాద్ నియోజకవర్గమే ఆదర్శం... 32 చెక్ డాం లు మంజూరు అయితే 20 కట్టుకున్నాం'' అని తెలిపారు.

''ధర్మాన్ని పాతర వేయవద్దనే ఈ వర్షంలో కూడా పాదయాత్ర చేస్తున్నా. కులం, పార్టీ కంటే జనంతోనే నాకు ఎక్కువ సంబందం ఉంది. ప్రజలంతా అండగా ఉంటామని అంటున్నారు. నేను కూడా మీ కష్టంలోనూ, సుఖంలోనూ తోడుగా వుంటా'' అని ఈటల పేర్కొన్నారు. 

ఇవాళ ఈటలతో పాదయాత్రలో మాజీ ఎంపీలు జితేందర్ రెడ్డి, చాడా సురేష్ రెడ్డి, మాజీ మంత్రి విజయ రామారావు, అశ్వద్ధామ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శ్రీధర, ధర్మా రావు, రావు పద్మ, మాజీ కార్పొరేటర్లు పాల్గొననున్నారు.