ఇవాళ్టి నుండి హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో తాను చేపట్టబోయే ప్రజా దీవెన పాదయాత్రకు ఆటంకాలు సృష్టించడానికి కేసీఆర్ నాయకత్వంలో చిల్లర పనులు జరుగుతున్నాయని ఈటల రాజేందర్ ఆరోపించారు. 

హుజురాబాద్: అధికార అండతో టీఆర్ఎస్ పార్టీ నాయకులు తాను చేపట్టిన ప్రజా దీవెన యాత్రకు ఆటంకాలు కల్పిస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ ఆరోపించారు. తాను పాదయాత్ర చేపట్టనున్నట్లు పది రోజుల క్రితమే ప్రకటించాను కాబట్టి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగానిదేనని అన్నారు. కానీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఈటల ఆందోళన వ్యక్తం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

''పాదయాత్రలో తనతో పాటు పాల్గొనే బిజెపి కార్యకర్తలకు బోజనాల ఓ రైస్ మిల్లులో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం రైస్ మిల్ యజమానితో కూడా నిన్న మాట్లాడాం. కానీ ఆయనను కూడా బెదిరించారట. ఓడిపోతామన్న భయంతోనే ఇలాంటి చిల్లర పనులు కేసీఆర్ నాయకత్వంలో జరుగుతున్నాయి'' అని ఈటల మండిపడ్డారు. 

వీడియో

''మాకు అడ్డంకులు సృష్టించాలని, నీచపు పనులు చేయాలని చూస్తే ఖబర్ధార్. ప్రజలను భయబ్రాంతులకు గురిచేయాలని చేయడం సరికాదు. చిల్లర వేషాలు వేసేవారిని వదిలిపెట్టం. ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తే మీకు గుణపాఠం తప్పదు'' అని ఈటల హెచ్చరించారు. 

read more హుజురాబాద్ ఉపఎన్నికే టార్గెట్ గా సీఎం మాస్టర్ ప్లాన్... మంత్రి గంగుల కీలక ప్రకటన

''మేము ఎలాంటి ప్రలోభాలను నమ్ముకోలేదు. ధర్మాన్ని, న్యాయాన్ని, ప్రజలను నమ్ముకున్నాం. కేసీఆర్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడటం ఇక్కడి నుంచే మొదలవుతుంది. హుజురాబాద్ లో ప్రచారం చేస్తున్న ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు మీకు దమ్ముంటే ముందు మీ దగ్గర పథకాలు అమలు చేయాలి. యావత్ తెలంగాణ ప్రజలు విముక్తి కావాలంటే తొలి అడుగు ఇక్కడినుంచే పడాలని ప్రజలు భావిస్తున్నారు'' అన్నారు ఈటల. 

''నా పాదయాత్రకు అండగా ఉండేందుకు అనేక వర్గాల ప్రజలు, అన్ని యూనివర్శిటీలు విద్యార్థులు, నిరుద్యోగులు వచ్చారు. ఈ పాదయాత్ర 25-26 రోజుల పాటు ప్రతి పల్లెను, ప్రతి గడపను కలిసేలా సాగుతుంది. ప్రజలందరూ నన్ను నిండు మనస్సుతో ఆశీర్వదించాలని కోరుతున్నా'' అన్నారు ఈటల రాజేందర్.