రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా నిలిచారు.   

రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రైతుల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అధికార బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. 

ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను నిరసిస్తూ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ దళితులు, గిరిజనులు, రైతుల పక్షాన ఉంటుందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ ను ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. పార్టీ ఎదుగుదల చూడలేకనే ..రేవంత్ పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

ఉచిత విద్యుత్ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత కేసీఆర్ దేనని చెప్పారు. కాంగ్రెస్ నేతలు మాట్లాడిన ప్రతి మాటను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి చెపుతున్న మాటలను ప్రజలు వింటున్నారని, బీఆర్ఎస్ నేతలు చెప్పే మాటలను ఎవరూ వినే పరిస్థితి లేదని అన్నారు. రైతుల రుణమాఫీ, గిట్టుబాటు ధర ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననీ, రైతులకు ఇచ్చిన రుణమాఫీ హమీని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని విమర్శించారు.