ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయానికి పలువురు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. ఎల్బీ స్టేడియం చేరుకుని గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ప్రజా గాయకుడు గద్దర్ భౌతికకాయానికి పలువురు మంత్రులు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు నివాళులర్పించారు. ఎల్బీ స్టేడియం చేరుకుని గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి.. కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీలకు అతీతంగా నేతలు తరలివచ్చి.. గద్దర్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలోనే కొంత రాజకీయ దుమారం కూడా చెలరేగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిల తీరుపై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ప్రజలు అభిమానించే గొప్ప వ్యక్తి మన మధ్య లేనప్పుడు రాజకీయాలు మాట్లాడటం సరైనది కాదని అన్నారు.
గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పూర్తిగా అనుకున్న ఆశయాలు నెరవేకుండానే గద్దర్ వెళ్లిపోయారని అన్నారు. స్వరాష్ట్రం ఏర్పడిన ఎక్కడి ఇబ్బందులు అక్కడే ఉన్నాయని గద్దర్ భావించారని చెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తానని తనతో గద్దర్ చెప్పారని తెలిపారు. తాను ఊహించినటువంటి తెలంగాణ రాలేదని ఆయన బాధ పడేవారని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. గద్దర్ కన్నుమూసిన తర్వాత ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయం ఆసుపత్రి నుంచి ఎక్కడికి తరలించాలనే దానిపై ఒకింత గందరగోళం ఏర్పడింది. తొలుత అల్వాల్లోని ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు. అయితే ఇంటి వద్ద తగిన స్థలం లేకపోవడంతో నిర్ణయం మార్చుకున్నారు. ఈ క్రమంలోనే ఎల్బీ స్టేడియానికి తీసుకెళ్లాలని కాంగ్రెస్ సూచనతో కుటుంబ సభ్యులు నిర్ణయానికి వచ్చినట్టుగా ప్రచారం సాగింది. ప్రభుత్వ నిర్ణయానికి కంటే ముందుగానే.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్తో ఫోన్లో మాట్లాడి గద్దర్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం కోసం ఎల్బీ స్టేడియం వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారని.. అనుమతి లభించిన వెంటనే మృతదేహాన్ని స్టేడియంకు తరలించారని వార్తలు వచ్చాయి.
ఈ పరిణామాలపై స్పందించిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇది చిల్లర రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. ప్రజలు అభిమానించే గొప్ప వ్యక్తి మన మధ్య లేనప్పుడు రాజకీయాలు మాట్లాడటం సరైనది కాదని అన్నారు. నిన్నటి నుంచే డ్రామాలు జరుగుతున్నాయని.. అది కరెక్ట్ కాదని చెప్పారు. ప్రజలకు గొంతుకైనా గద్దర్కు ఘనంగా నివాళులర్పించాలని.. ఇక్కడకు వచ్చే వేలాది మంది ఎవరో పిలిస్తే వచ్చినవారు కాదని అన్నారు. ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వడానికి చూడాలని అన్నారు. గద్దర్ ప్రజాప్రతినిధి కాదని.. ప్రజల గొంతుక అని అని చెప్పారు. అందుకే ఆయన మరణవార్త తెలిసిన వెంటనే.. భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఎల్బీ స్టేడియానికి తరలించడానికి, అధికార లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించడానికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ఇక్కడికి వచ్చినవారు రాజకీయాలు మాట్లాడటం సరికాదని.. అవి మాట్లాడటానికి వేరే వేదికలు ఉన్నాయని అన్నారు.
ఇక, రేవంత్ ఉద్దేశించి స్పందించిన మంత్రి తలసాని.. ‘‘కొంతమంది అన్నీ తామే చేస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. లాల్ బహద్దూర్ స్టేడియం కూడా వాళ్లే ఆరెంజ్ చేశారు అని చెప్పుకుంటున్నారన్నారు. చిల్లర రాజకీయాలు మాట్లాడటం మానుకోవాలి’’ అని అన్నారు.
