నిలోఫర్ ఆస్పత్రి కిడ్నాప్ ఘటన.. మహిళ కిడ్నాపర్ చెర నుంచి చిన్నారిని రక్షించిన పోలీసులు..
హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి నుంచి కిడ్నాప్కు గురైన చిన్నారి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. మహిళ కిడ్నాపర్ చెర నుంచి ఆరు నెలల బాలుడిని పోలీసులు రక్షించారు.

హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రి నుంచి కిడ్నాప్కు గురైన చిన్నారి సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. మహిళ కిడ్నాపర్ చెర నుంచి ఆరు నెలల బాలుడిని పోలీసులు రక్షించారు. దాదాపు వారం రోజుల క్రితం కిడ్నాప్ జరగగా.. పోలీసులు అన్ని విధాలుగా కిడ్నాపర్, బాలుడి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నించారు. తాజాగా ఈ కేసును పోలీసులు చేధించారు. బాలుడిని త్వరలోనే అతడి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. బాలుడిని పోలీసులు రక్షించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఆసుపత్రిలో బాలుడి తల్లి ఫరీదా బేగంతో స్నేహం చేసిన మహిళ పసిబిడ్డను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆసుపత్రిలో ఉన్న ఫరీదా బంధువుల సమక్షంలో ఆమె నుంచి నిందితురాలు బాలుడిని తీసుకుంది. అయితే ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఫరీదా ఆమె బంధువులు బాలుడి కోసం, మహిళ కోసం ముమ్మరంగా వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. బాలుడి తల్లి ఫరీదాకు మాయమాటలు చెప్పి నిందితురాలు ఈ కిడ్నాప్ చేసిందని గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో మహిళ చిన్నారిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు నమోదయ్యాయి.